హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ఇష్టమైన ఆహారం కోసం మహా అయితే ఏడాదిలో కొన్ని వేలు లేదంటే అంతకంటే కొంత ఎక్కువ మొత్తం ఖర్చుచేస్తాం. కానీ, హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు ఏకంగా రూ.6 లక్షలను ఖర్చు చేశాడు. అంత ఖరీదైన వంటకమా అంటే ఇడ్లీల కోసమే. గరిష్ఠంగా 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేశాడు. రోజుకు సగటున 23 ప్లేట్ల ఇడ్లీలను బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు తన స్నేహితులు, కుటుంబసభ్యుల కోసం ఆర్డర్ చేశాడు. ఇటీవల ప్రముఖ ఆన్లైన్ డెలివరీ సంస్థ స్విగ్గీ విడుదలచేసిన నివేదికలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా వెల్లడించింది.
స్విగ్గీ సంస్థ ప్రతి సంవత్సరం మార్చి 30న ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని పురస్కరించుకొని తన ఆర్డర్ల విశ్లేషణ నివేదికను విడుదల చేస్తున్నది. 30 మార్చి 2022 నుంచి 25 మార్చి 2023 వరకు తనకు వచ్చిన ఆర్డర్లు, ప్రజాదరణ పొందిన వంటకాల వివరాలను ప్రకటించింది. గడచిన 12 నెలల్లో 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీలను స్విగ్గీ డెలివరీ చేసింది. ఇడ్లీలు ఎకువగా ఆర్డర్ చేసిన నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తరువాత ముంబై, కోయంబత్తూర్, ఫుణె, వైజాగ్, ఢిల్లీ, కోల్కతా, కొచ్చి ఉన్నాయని వివరించింది. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య ఎక్కువ మంది ఇడ్లీలను ఆర్డర్ చేస్తుండగా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూర్, ముంబై వినియోగదారులు డిన్నర్ సమయంలోనూ ఆర్డర్ చేస్తారని, అన్నిచోట్ల సాదా ఇడ్లీ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన వేరియంట్ అని తెలిపింది.