జహీరాబాద్, డిసెంబర్ 22: చిరుధాన్యాల సాగు(Millets cultivation)తో ఆహార భద్రత(Food security) సాధ్యమని, కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండడంతో సన్న, చిన్నకారు రైతులు సాగుచేస్తున్న పంటలు కనుమరుగు అవుతున్నాయని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్లో శుక్రవారం ‘డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ’ (DDS)ఆధ్వర్యంలో ‘చిరుధాన్యాలతో ఆహార సార్వభౌమత్యం’ పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంగారెడ్డి, వరంగల్, వికారాబాద్, యాదాద్రి జిల్లాల నుంచి మహిళా రైతులు హాజరై వ్యవసాయంలో వస్తున్న మార్పులపై చర్చించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..వాతావరణ మార్పులను తట్టుకునేలా పంటలు సాగుచేసేందుకు కావాల్సిన విత్తనాలు ఉత్పత్తని ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. ప్రతి ఏడాది విత్తనాలు వేసే సమయంలో వాతావరణంలో మార్పులు వచ్చి రైతులు నష్టపోతున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిరుధాన్యాల సాగును ప్రోత్సహించి, ఆ పంటలను కాపాడాలన్నారు. మార్కెట్లో చిరుధాన్యాలకు ధర ఉన్నా దిగుబడి లేదన్నారు.
సేంద్రియ ఎరువుల ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం చిరుధాన్యాలు సాగుచేసే రైతులను గుర్తించి ఆవులు, బర్రెలు, మేకలు సబ్సిడీపై అందజేయాలని విజిప్తి చేశారు. సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చిరుధాన్యాల ఆహారం పంపిణీ చేయాలని కోరారు. పత్తి, వరి పంటల సాగును తగ్గించి చిరుధాన్యాల సాగును పెంచేందుకు రైతులను ప్రోత్సహించాలన్నారు.
జొన్న, సజ్జ, రాగి, అరికెలు, కొర్ర, కొడిసమ, వరిగి మొదలైన చిరుధాన్యాలకు మద్దతు ధర కలిపించాలన్నారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని, చిరుధాన్యాలను ప్రాసెసింగ్ చేసేందుకు యంత్రాలు సమకూర్చాలన్నారు. సమావేశంలో డీడీఎస్ డైరెక్టర్ డాక్టర్ రుక్మిణిరావు, ప్రముఖ జర్నలిస్టులు కె.సజయ, రమేశ్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నిమ్మయ్య, అమరేంద్ర, జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ భిక్షపతి, మహిళా రైతులు పాల్గొన్నారు.