హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఆహారశుద్ధి రంగంలో మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అతి తక్కువ వడ్డీకే రుణాలను మంజూరు చేయనున్నది. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం (పీఎంఎఫ్ఎంఈ)కింద ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలో 10 వేల మందికి రుణాలు ఇవ్వనున్నారు. గరిష్ఠంగా ఒక్కొక్కరికి రూ.40 వేల చొప్పున వ్యక్తిగతంగా రుణం మంజూరు చేస్తారు. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క లక్ష్యాన్ని నిర్దేశించి, రుణాలు మంజూరు చేయనున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి డీఆర్డీవోలకు, అక్కడి నుంచి మండల, గ్రామ సమాఖ్యలకు నిధులను విడుదల చేస్తారు. గ్రామ సమాఖ్యలు సంబంధిత గ్రూపులకు నిధులను విడుదల చేస్తాయి. వారు రుణం పొందినవారికి వ్యక్తిగతంగా ఈ మొత్తాన్ని అందజేస్తారు. ఈ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. గ్రామ సమాఖ్యలకు అతి తక్కువ వడ్డీతో తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. ఈ మొత్తంతో గ్రామ, మండల సమాఖ్యలు బలోపేతం కానున్నాయి.
ఎంపిక చేసిన యూనిట్లు ఇవే..
ఫుడ్ ప్రాసెసింగ్లో 20 రకాల యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సేమ్యా పాకెట్ల తయారీ, మిరపకారం పొడి, పసుపు పొడి, కొబ్బరి లడ్డు, జొన్న, గోధుమ, రాగి, బియ్యం, శనగపిండి, మురుకులు, రింగ్ మురుకులు, జంతికలు, గారే మురుకులు, మసాల పరిశ్రమ, కందిపప్పు, పెసర పప్పు, శెనగపప్పు తయారీ, స్వీట్స్, మిక్చర్, బాదుషా, బూందీ, పచ్చళ్ల తయారీ, ఇరిగిన బియ్యం, రవ్వ, ఇడ్లీ, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, గరం మసాలా పౌడర్, జొన్న లడ్డు, రాగి లడ్డు, పల్లీ చిక్కీ, పాల ఉత్పత్తులు, బేకరీ ఉత్పత్తులు, అప్పడాల తయారీ, ఆవాలు, లవంగాలు, నల్ల మిరియాలు, యాలకులు, డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ ఇలా పలు రకాల ఆహార ఉత్పత్తులకు సంబంధించిన చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.