ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడి
నిజామాబాద్ సిటీ, జూన్ 12: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చే రైతులు, హమాలీల కోసం అన్నదాన కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. శనివారం నిజామాబాద్ మార్కెట్యార్డులో హమాలీ యూనియన్ కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కొన్నేండ్లుగా నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో కొనసాగుతున్న విధంగానే మార్కెట్ యార్డులోనూ ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. రైతులకు వెన్నుదన్నుగా ఉండే హమాలీ కార్మికులను అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు. అనంతరం మార్కెట్ యార్డులో ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రదేశాన్ని ఎమ్మెల్సీ కవిత, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి పరిశీలించారు. మార్కెట్ యార్డుకు రైతులు తెచ్చిన ఆమ్చూర్ను పరిశీలించారు. అనంతరం ఐడీసీఎంఎస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్, నగర మేయర్ నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.