హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ)/మియాపూర్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచరులు తమ భూములను కబ్జా చేశారని, నిత్యం భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కూకట్పల్లి మండలం శంశిగూడ, ఎల్లమ్మబండకు చెందిన దళితులు అవేదన వ్యక్తంచేశారు. దాదాపు 100 మందికిపైగా బాధితులు మినిస్టర్స్ క్వార్టర్స్లో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఆదివారం ప్రత్యేకంగా కలిసి, ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ.. 2001లో ఒక్కొక్కరికి 80 గజాల చొప్పున మొత్తం 200 దళిత కుటుంబాలకు శంశిగూడ, ఎల్లమ్మబండ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 57లో అప్పటి ప్రభుత్వం నివాస భూమిని కేటాయించడంతోపాటు పట్టాలను అందజేసిందని వివరించారు.
ప్రభుత్వం తమకు ఇచ్చిన భూములపై ఈటల రాజేందర్ బంధువులు, అనుచరులు కన్నేశారని వాపోయారు. ఇప్పటికే కొందరి భూములను ఆక్రమించుకున్నారని, ఇదేమని అడిగితే దౌర్జన్యానికి దిగుతున్నారని, నిత్యం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈటల రాజేందర్ అనుచరుల భూ కబ్జాలపై ఈడీ, విజిలెన్స్ విచారణ జరిపించాలని బీజేపీ అగ్రనేతలకు లేఖ రాసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.
ఈ విషయంలో వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్కు బాధితులు విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి కొప్పుల సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ అంశంపై వెంటనే పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత కలెక్టర్, ఆర్డీవోను మంత్రి ఆదేశించారు. అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని బాధిత దళితులకు మంత్రి భరోసా ఇచ్చారు. తమకు జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టర్, మానవహక్కుల సంఘం, ఎస్సీ,ఎస్టీ కమిషన్కు సైతం ఫిర్యాదు చేసినట్టు బాధితులు పేర్కొన్నారు.