హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రభుత్వం మారినట్టుగానే విద్యారంగంలోనూ మార్పులు రావాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది. కొత్త ప్రభుత్వం విద్యారంగాన్ని సమీక్షించాలని, విద్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలని కోరింది. ఆదివారం హైదరాబాద్ దోమల్గూడలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారీ విద్య బలోపేతానికి కృషిచేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యయుత వాతావరణం నెలకొల్పాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు వీ జంగయ్య, ప్రధానకార్యదర్శి చావ రవి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సర్వీసు రూల్స్, డిప్యూటీ డీఈవో, హెచ్ఎం, సబ్జెక్టు టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. పెండింగ్ బిల్లులను మంజూరుచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాములు, దుర్గాభవాని, కోశాధికారి లక్ష్మారెడ్డి, మాణిక్రెడ్డి, ఎం రాజశేఖర్రెడ్డి, నాగమణి, వెంకటి, శాంతకుమారి, బీ రాజు, రవికుమార్, సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.