హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): పని ప్రదేశాల్లో మహిళల పట్ల తప్పుగా ప్రవర్తించాలంటేనే భయం కలగాలని, ఆ దిశగా ‘సాహస్’ వింగ్ పనిచేయాలని డీజీపీ అంజనీకుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లక్డికపూల్లోని స్టేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో సాహస్పై శుక్రవారం వర్క్షాప్ నిర్వహించారు. పోష్ యాక్డ్-2013(ప్రీవెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ప్లేస్)పై అవగాహన కల్పించారు. సాహస్.. మహిళా ఉద్యోగులకు రక్షణ వలయమని డీజీపీ తెలిపారు. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు క్షమించరాని నేరమని హెచ్చరించారు.
సాహస్కు వచ్చిన ఫిర్యాదులపై ఎంతో సున్నితంగా వ్యవహరించాలని, మహిళల గోప్యత తదితర అంశాలపై దృష్టి సారించాలని చెప్పారు. పని ప్రదేశాల్లో వేధింపుల నివారణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషన్ డీజీ షిఖా గోయెల్ మాట్లాడుతూ ఫిర్యాదులను పరిష్కరించేటప్పుడు అనుసరించాల్సిన విధానాలపై సమగ్ర అవగాహన ఉండాలని వివరించారు. కార్యాలయాల్లో మహిళలకు సురక్షితమైన వాతారవణం ఉండాలని స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ అడిషనల్ డీజీ అభిలాష బిస్త్ సూచించారు. వర్క్షాప్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పీవీ పద్మజతోపాటు 108 మంది సిబ్బంది పాల్గొన్నారు.