హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఫ్లోరోసిస్పై సాధించిన విజయానికి గుర్తుగా నల్లగొండ జిల్లా మర్రిగూడలోని ఫ్లోరైడ్ బాధితులంతా ఒకచోట చేరి దీపావళిని జరుపుకొన్నారు. భగీరథ విజయం గా నిర్వహించుకొన్న ఈ వేడుకల్లో ఫ్లోరోసిస్ బాధితులు, వారి కుటుంబసభ్యులతోపాటు టీఆర్ఎస్ నేతలు, ప్రజలు పాల్గొన్నారు. ఫ్లోరోసిస్ బాధితుల కోసం మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా పంపిన స్వీట్లు, పటాకులను విప్ బాల్క సుమన్ వారికి అందజేశారు. అనంతరం ఆయన ఫ్లోరైడ్ రక్కసికి నిప్పంటించి వేడుకలను ప్రారంభించారు.
అనంతరం ఫ్లోరోసిస్ బాధితులు పటాకులు కాల్చి ఆనందాల్లో మునిగితేలారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వం లో ఇంటింటికీ నీళ్లు ఇచ్చే భగీరథ పథకం ద్వారా ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమివేశామని అన్నారు. ఈ విజయానికి గుర్తుగా ఫ్లోరోసిస్ భూతాన్ని దహనం చేశామని, ఇకనుంచి నల్లగొండ ప్రజల జీవితాల్లో ఈ వెలుగులు నిలిచే ఉంటాయని చెప్పారు. ఈ వేడుకలో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్ ఆర్అండ్డీ చైర్మన్ ప్రొఫెసర్ బానోతు రమణనాయక్, టీఆర్ఎస్ నేతలు కర్నాటి విద్యాసాగర్, ఫ్లోరోసిస్ విముక్తి సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాష్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ తమకు ప్రేమతో స్వీట్లు, దీపావళి పటాకులు పంపించినందుకు ఫ్లోరోసిస్ బాధితులు అంశల స్వామి, బూడిద సుకన్య, సురిగి రాములు, జంగిటి శివ కృతజ్ఞతలు తెలిపారు.