హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్: ఎగువ నుంచి వస్తున్న వరదకు తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు భారీగా ఇన్ఫ్లోలు నమోదవుతున్నాయి. కర్ణాటకలోని ఆల్మట్టి మొదలుకొని చివరి ప్రాజెక్టు వరకు వరద పోటెత్తుతున్నది. జూరాలకు 1.20 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. 20 గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా లక్షకుపైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కృష్ణా నది వరదతోపాటు తుంగభద్ర ప్రవాహం కలుపుకొని శ్రీశైలానికి సోమవారం మధ్యాహ్నం లక్షా 50వేల ఇన్ఫ్లో నమోదైంది. సాయంత్రానికి 1.10 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 41.1060 టీఎంసీలకు చేరింది. ఇక్కడి నుంచి నాగార్జున సాగర్కు దాదాపు 27 వేల క్యూసెక్కుల వరద వెళ్తున్నది. నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నుంచి రెండు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి 41,475 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 877 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. జలాశయంలో 100.855 టీఎంసీలకు ప్రస్తుతం 50.459 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.
శ్రీరాంసాగర్కు 12,658 క్యూసెక్కుల వరద
గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి 12,658 క్యూసెక్కుల వరద వస్తున్నది. ఈ సీజన్లో ప్రాజెక్ట్లోకి ఇప్పటివరకు 56 టీఎంసీల నీరు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమైన లక్ష్మి బరాజ్కు 38,600 క్యూసెక్కులు, సరస్వతి బరాజ్కు 19,340 క్యూసెక్కుల వరద నమోదవుతున్నది.