హైదరాబాద్, జులై 19 (నమస్తే తెలంగాణ): వరద ముంపులో ఉన్న భద్రాచలంలో సహాయ, పునరావాస కార్యక్రమాలను ప్రభుత్వం శరవేగంగా చేపడుతున్నది. తాగు నీరు, పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీరాజ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొంటున్నారు. వేర్వేరు జిల్లాల నుంచి సిబ్బంది భద్రాచలం తరలించి పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు చేపడుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్న తీరుపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంగళవారం బంజారాహిల్స్లోని మంత్రుల నివాసప్రాంగణంలో ఆ శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాతో సమీక్షించారు. శాఖాపరంగా తీసుకొంటున్న చర్యలను సందీప్కుమార్ సుల్తానియా వివరించారు. జిల్లాలో 45 గ్రామాలు, 96 ఆవాసాలు తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు.
వర్షాలకు బాగా నష్టపోయిన బూర్గంపాడు, సారపాక, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. పారిశుద్ధ్య పనుల కోసం అవసరమైతే మరికొంత మందిని, యంత్రాలను పంపించాలని ఎర్రబెల్లి ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సైతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సహాయ, పునరావాస కార్యక్రమాలపై కలెక్టర్, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ప్రతి మండలానికి ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి వివిధశాఖల ద్వారా కొనసాగుతున్న కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రతి గ్రామంలో మెడికల్, విద్యుత్తు, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక బృందాలను నియమించినట్టు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 4,100 మంది సిబ్బందిని ఇతర జిల్లాల నుంచి తరలించినట్టు తెలిపారు. పురపాలకశాఖ నుంచి 400 మంది శానిటేషన్ సిబ్బంది తరలించామని, మొబైల్ టాయిలెట్లు, ఇతర ఎమెర్జెన్సీ సామాగ్రిని పంపించామని తెలిపారు. ప్రతి గ్రామానికి ముగ్గురు, నలుగురు పంచాయతీ కార్యదర్శులను నియమించి శానిటేషన్ చేపడుతున్నట్టు పేర్కొన్నారు.
మలేరియా, డెంగ్యూ లేవు
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం 436 వైద్య శిబిరాల్లో 10,000 మందికిపైగా వైద్యచికిత్స అందించామని సీఎస్ వివరించారు. ఇప్పటివరకు మలేరియా, డెంగ్యూ కేసులు నమోదుకాలేదని పేర్కొన్నారు. ప్రతి మండలానికి ఒక వైద్యారోగ్యశాఖ అధికారిని, జిల్లా మలేరియా అధికారులను నియమించామని, గర్భిణులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. అధికారులు సహాయ, పునరావాస చర్యల్లో సమర్థంగా పాల్గొనడంపై ప్రజలు అభినందిస్తున్నారని సీఎస్ తెలిపారు. భద్రాద్రి, ఖమ్మం జిల్లా కలెక్టర్లతో పాటు పంచాయతీరాజ్శాఖ డైరెక్టర్, ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, ప్రత్యేకాధికారి రజత్ కుమార్సైనీలు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్స్లో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, విపత్తు నివారణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పంచాయితీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.