శ్రీశైలం, నాగార్జున సాగర్లో 4 చొప్పున గేట్లు ఎత్తి నీటి విడుదల
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 3: కృష్ణా బేసిన్లో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. గత కొన్నిరోజులుగా 4 లక్షల పైచిలుకు క్యూసెక్కుల ప్రవాహం కొనసాగగా, మంగళవారం సాయంత్రం వరకు సగానికి తగ్గింది. కర్ణాటకలోని ఆల్మట్టి మొదలుకొని పులిచింతల వరకు ఇన్ఫ్లో భారీగా పడిపోయింది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 2,75,278 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 1.50 లక్షల క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదవుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలకు గాను ప్రస్తుతం 107.14 టీఎంసీలకు చేరింది. జూరాల ప్రాజెక్టుకు 1.71 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 25 గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా మొత్తం 1.65 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నాయి. ప్రాజెక్టులో నీటినిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలకు ప్రస్తుతం 7.35 టీఎంసీల నీరున్నది. శ్రీశైలం జలాశయానికి 1,84,157 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 1,77,418 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం 215.81 టీఎంసీలకు ప్రస్తుతం 212.44 టీఎంసీలు నిల్వ ఉన్నది. నాగర్జునసాగర్కు 1,40,056 క్యూసెక్కుల నీరు వస్తుండగా నాలుగు గేట్ల ద్వారా 67,960 క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు 29,120 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది.