హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కృష్ణానదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు వేద విద్యార్థులతోపాటు వేద ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన ఏపీలో శుక్రవారం చోటుచేసుకున్నది. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులోని శ్వేత శృంగాచలం వేద పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు, ఓ వేద ఉపాధ్యాయుడు శుక్రవారం మధ్యాహ్నం సమీపంలోని కృష్ణానదిలో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీట మునిగి మధ్యప్రదేశ్కు చెందిన శివవర్మ (14), ఉత్తరప్రదేశ్కు చెందిన నితీష్కుమార్ దీక్షిత్ (15), హర్షిత్ శుక్లా (15), శుభం త్రివేది (17), అన్షునమ్ శుక్లా (14)తోపాటు నరసరావుపేటకు చెందిన ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. నదిలో సుడిగుండాల కారణంగానే ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటన పట్ల ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, హోంమంత్రి సుచరిత, విద్యాశాఖ మంత్రి సురేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు.