హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో అరెస్టయిన ప్రధాన నిందితుడు ప్రవీణ్కుమార్ నుంచి స్వాధీనం చేసుకొన్న పెన్డ్రైవ్లో ఐదు ప్రశ్నపత్రాలు ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఏఈ పరీక్షతోపాటు జరుగబోయే టౌన్ప్ల్లానింగ్, అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, వెటర్నరీ విభాగానికి చెందిన పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు ఉన్నట్టు తేల్చారు. ఏఈ పరీక్ష ఈ నెల 5న నిర్వహించగా, మిగతా పరీక్షలు జరగాల్సి ఉన్నది. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు ఏఈ ప్రశ్నపత్రం మాత్రమే లీకైనట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. సిట్ ఆధ్వర్యంలో మరింత లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. సాంకేతక ధ్రువీకరణ కోసం ప్రవీణ్ వాడిన కంప్యూటర్, ప్రశ్నపత్రాలుండే విభాగంలోని కంప్యూటర్లలోని బిట్ లాకర్లు తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
టీఎస్పీఎస్సీ ఏఈ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు మొదలు పెట్టింది. కమిషన్ కార్యాలయానికి వెళ్లి కస్టోడియన్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మికి పాస్వర్డ్ ఎలా అపహరణకు గురయ్యిందనే విషయంపై సిట్ అధికారులు ఆరా తీశారు. కార్యదర్శి పీఏ ప్రవీణ్కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి ప్రశ్నపత్రాలు ఉండే ప్రధాన కంప్యూటర్లోకి లాగిన్ అయ్యేందుకు కస్టోడియన్ ఇన్చార్జి ఒక పుస్తకంలో రాసిపెట్టిన తన యూజర్ ఐడీ, పాస్వర్డ్లను ఆమెకు తెలియకుండా అపహరించారు. ఆమె లేని సమయంలో ప్రవీణ్ లాన్లో ఆమె సిస్టమ్ను తన కంప్యూటర్ నుంచి ఓపెన్ చేశాడు. ఆమె కంప్యూటర్లో ప్రశ్న పత్రాలు ఫోల్డర్లోకి వెళ్లి దానిని, ఫిబ్రవరి 27న తన కంప్యూటర్ ద్వారా పెన్డ్రైవ్లోకి కాపీ చేశాడు.
ఏఈ పరీక్ష పత్రాలు రేణుక ద్వారా రూ.10 లక్షలకు విక్రయించి, సక్సెస్ కావడంతో, ఈ నెల 12న జరుగాల్సిన టౌన్ప్లానింగ్ పేపర్కు కూడా భారీ ఎత్తున బేరసారాలు సాగించారు. జరుగబోయే పరీక్షల ప్రశ్నపత్రాలు విక్రయించి భారీగా డబ్బు సంపాదించాలని ప్లాన్చేసి ఇంతలోనే పోలీసులకు దొరికిపోయారు. నిందితుల వద్ద లభించిన ఆధారాలు, సాంకేతికంగా సేకరించిన ఆధారాలతోపాటు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించి దర్యాప్తులో వెల్లడయిన అన్ని అంశాలను ఒకటికి రెండుసార్లు అధికారులు పరిశీలించనున్నారు.
కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్తోనే బిట్ లాకర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. దీ నిలో ఎన్క్రిప్టెడెడ్ డాటా స్టోర్ అయి ఉం టుంది. దానిని డీక్రిప్ట్ చేసి ఆ కంప్యూటర్ లో గుర్తుతెలియని వ్యక్తులు ఎప్పుడు? ఎ క్కడి నుంచి లాగిన్ అయ్యారు? ఏ ఫోల్డర్లు పరిశీలించారు? ఏమి కాపీ చేశారు? అనే సమాచారం సేకరిస్తారు. టీఎస్పీఎస్సీలోని ప్రవీణ్ వాడిన కంప్యూటర్, కస్టోడియన్ ఆధ్వర్యంలో ఉండే కంప్యూటర్లలోని బిట్ లాకర్లను ఓపెన్ చేయనున్నారు. ఆయా కంప్యూటర్లలో సాప్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన సమయంలో ఒక ‘కీ’ని ఇస్తారు, ఆ ‘కీ’ భద్రంగా ఉంటే, ఎప్పుడైనా బిట్ లాకర్స్ ఓపెన్ చేసేందుకు అవకాశముంటుంది. ఒక వేళ ఈ కీ లేకపోతే, ఇతర సాప్ట్వేర్ల సహాయంతోనూ బిట్లాకర్స్ ఓపెన్ చేసుకోవచ్చు. సిస్టమ్ హిస్టరీని తెలుసుకోవడానికి మరిన్ని మార్గాలుండటంతో అన్ని కోణాల్లో సిట్ ఆరా తీస్తున్నది.