10th Class Exams | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతించాలని ఎస్సెస్సీ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షాకేంద్రాల్లోకి పంపించబోమని స్పష్టం చేసింది. విద్యార్థులు పరీక్షాసమయానికి ముందుగానే చేరుకోవాలని సూచించారు. పదోతరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్సెస్సీబోర్డు అధికారులు పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సారి ప్రశ్నపత్రాలు తారుమారుకాకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు చేపట్టారు. పేపర్కోడ్, సబ్జెక్టు, మీడియం తప్పుగా వచ్చినట్టయితే ఇన్విజిలేటర్లు వెంటనే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులను (సీఎస్డీవో) సంప్రదించాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినవారిపై 1997చట్టం 25 ప్రకారం క్రమశిక్షణాచర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
పొరపాట్లకు ఆస్కారమున్నదిక్కడే..
సహజంగా మొదటి భాష (తెలుగు) పరీక్ష రోజున ప్రశ్నపత్రాలు తారుమారయ్యే అవకాశం ఉన్నది. పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులకు 10టీ, 02టీ కోడ్ ఉన్న పేపర్లకు 80 మార్కుల పరీక్ష ఉంటుంది. అదేరోజు కాంపొజిట్ కోర్సు తెలుగు విద్యార్థులకు 60 మార్కులకు 03టీ కోడ్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్ల పంపిణీ సమయంలో ఇన్విజిలేటర్లు గందరగోళానికి గురవుతున్నారు. తెలుగుతో పాటు ఊర్దూ విషయంలోనూ ఇదే తరహా గందరగోళం జరుగుతున్నది. దీనిని నివారించేందుకు కాంపోజిట్ ప్రశ్నపత్రాలను కలర్పేపర్పై ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.