Covid | జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కరోనా బారిన పడ్డారు. మొదట ఆ కుటుంబంలోని వృద్ధురాలికి కొవిడ్ నిర్ధారణ అయింది. దీంతో ఆ కుటుంబంలోని మిగతా నలుగురు కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకున్నారు. ఆ నలుగురికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఐదుగురిని ఇంట్లోనే అధికారులు ఐసోలేషన్లో ఉంచారు. కరోనా బారిన పడ్డ ఐదుగురి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎంహెచ్వో మధుసూదన్ వెల్లడించారు.
కరోనా కేసులు అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో పదేండ్ల లోపు చిన్నారులు, 60 ఏండ్లు పైబడ్డ వారు జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా తమ నివాసాల నుంచి బయటకు రాకూడదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచించింది. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఆదేశించింది. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే తక్షణమే కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది.