కేతేపల్లి, జూన్ 27: నల్లగొండ జిల్లా కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టు నిండుకుండలా మారటంతో అధికారులు సోమవారం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో సోమవారం ఉదయం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొన్నది. అప్రమత్తమైన అధికారులు ఐదు క్రస్టు గేట్లను ఒక్కో అడుగు మేర ఎత్తి నీటిని నదిలోకి వదిలారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 1,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవ్వగా, రాత్రి వరకు 4,935 క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 (4.46 టీఎంసీలు) అడుగులకుగాను ప్రస్తుతం 644.40 (4.30 టీఎంసీలు) అడుగులు ఉన్నట్టు ప్రాజెక్టు ఏఈ డీ ఉదయ్కుమార్ తెలిపారు. జూన్లో మూసీ గేట్లు ఎత్తడం ప్రాజెక్టు చరిత్రలో ఇదే తొలిసారని ఆయన చెప్పారు.
లక్ష్మీ బరాజ్లో భారీగా వరద నీరు
మహదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ బరాజ్లోకి వరద నీరు భారీగా చేరుతున్నది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో వరద పెరుగుతున్నది. ఆదివారం 9,300 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా సోమవారం 17,320 క్యూసెక్కులకు పెరిగింది. అవుట్ఫ్లో 8,830 క్యూసెక్కులుగా నమోదవుతున్నది. బరాజ్ 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.