హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాల్లో మాత్రమే కనిపించే అరుదైన జాతి బావురు పిల్లి ఏపీలో కనిపిచింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల తీరప్రాంతంలోని అభయారణ్యంలో దీని ఉనికిని కనుగొన్నట్టు అవనిగడ్డ ఫారెస్ట్ రేంజ్ అధికారి రాఘవరావు వెల్లడించారు. రపైనెలూరుస్ వైవెర్రినస్ అనే శాస్త్రీయ నామంతో పిలిచే ఈ బావురు పిల్లిని పులి బావుర, మరక పిల్లి, నీటి పిల్లి, ఫిషింగ్ క్యాట్ అని కూడా అంటారు. చేపలను వేటాడి జీవించే ఈ జాతి పిల్లులు ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. వీటి మొత్తం సంఖ్య 2 వేలలోపే ఉన్నట్టు అంచనా.
ఈ నేపథ్యంలో వేటగాళ్ల బారి నుంచి వీటిని రక్షించేందుకు ఏపీలోని తీరప్రాంత గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 78 సెం.మీ. పొడవు, 8.8 కిలోల వరకూ బరువు ఉండే ఈ బావురు పిల్లి అచ్చం చిరుత పులిని పోలి ఉంటుంది. రాత్రి వేళల్లో మాత్రమే చేపలను వేటాడి జీవిస్తుంది. మన ఇండ్లలో తిరిగే పిల్లుల కంటే పెద్దగా చిరుత పులికంటే చిన్నగా ఉంటుంది. ఇది చేపల వేటకు వెళ్లే సమయంలో ఆ పరిసరాల్లో మల, మూత్ర విసర్జన చేస్తుంది. ఈ వాసన గమనించిన ఇతర జంతువులు ఆ పరిసరాలకు రావు.