Mrigasira Karthi | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): మృగశిర కార్తె సందర్భంగా వచ్చే నెల 9న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. మంగళవారం సచివాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, చేప ప్రసాదం పంపిణీ చేసే బత్తిన సోదరులతో మంత్రి సమావేశమయ్యారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా చేప ప్రసాదానికి ఇతర రాష్ర్టాలు, దేశాల నుంచి లక్షల మంది వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 25న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అవసరమైన చేప పిల్లలను మత్స్యశాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచుతామని మంత్రి తలసాని వెల్లడించారు.