హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): డిజిటల్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీ వాలెట్ ఓ అద్భుతమని రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ తెలిపారు. టీ వాలెట్ ద్వారా ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేశామని చెప్పారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో జీ-20 దేశాల ఆర్థిక సదస్సులో రెండో రోజైన ఆదివారం జయేశ్రంజన్ మాట్లాడారు. దేశంలో 2016లో పెద్దనోట్ల రద్దు చేసిన సందర్భంలో బ్యాంకుల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వివరించారు. ఆ తర్వాత డిజిటల్ పేమెంట్ ప్రాధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. ప్రజల పరిస్థితి, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని దేశంలోనే తొలిసారిగా టీ వాలెట్ను తీసుకొచ్చామని గుర్తు చేశారు. తెలంగాణలోని మారుమూల పల్లెల్లోనూ టీ వాలెట్ అందుబాటులో ఉన్నదని చెప్పారు. గడిచిన ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో బ్యాంకింగ్ రంగం గణనీయమైన వృద్ధిని సాధించిందని వివరించారు.
బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక లావాదేవీల్లో మానవ ప్రమేయాన్ని తగ్గించామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక చేయూతను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, రైతుబంధు, తదితర అనేక పథకాలను నేరుగా లబ్ధిదారులకే అందజేస్తున్నామని తెలిపారు. టీ వాలెట్ నుంచి ఏదైనా బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేసుకోవచ్చని, ఎటువంటి సర్వీస్ చార్జీ లేకుండానే సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఏడేండ్లలోనే 1.39 మిలియన్ సబ్స్ర్కైబర్లు టీ వాలెట్కు ఉన్నారని, 35 మిలియన్ లావాదేవీలు జరిగాయని వివరించారు. డిజిటల్ రంగంలో తెలంగాణ టీ వాలెట్ ఒక కేస్ స్టడీలా ఉపయోగపడుతుందని తెలిపారు. సమావేశంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్సేథ్తోపాటు 40 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.