సత్తుపల్లి రూరల్, డిసెంబర్ 2: తెలంగాణ సాధన కోసం 1969లో సత్తుపల్లి కేంద్రంగా ఉద్యమించిన చింతోజు బ్రహ్మచారి (73) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా సత్తుపల్లి. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సీఆర్ రెడ్డి కళాశాలలో 1967-69లో పీయూసీ చదివారు. తొలిదశ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ఆయన తోటి ఉద్యమకారులు బొంతు వెంకటేశ్వరరావు, మందపాటి కృష్ణారెడ్డి, జక్కం మోహనరావు, తూము వెంకటేశ్వరరావు, గుమ్మడిదల సుబ్బారావు, ఫసతుల్లాతో కలిసి సత్తుపల్లిలో ఉద్యమం చేపట్టారు. అనేకసార్లు అరెస్టు అయ్యారు. మధిర సబ్జైలులో 13 రోజులు ఖైదీలుగా ఉన్నారు. బ్రహ్మచారి మృతి విషయం తెలుసుకున్న సహచర ఉద్యమకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాటి ఉద్యమకారులు బొంతు వెంకటేశ్వరరావు, కంచర్ల బాబూరావు, ఖమ్మం మమత మెడికల్ కళాశాల డైరెక్టర్ కొత్తూరు ప్రభాకరరావు, లయన్స్క్లబ్ సభ్యుడు దారా కృష్ణారావు, సుభాష్ యువజన సంఘం ప్రతినిధి పీఎల్ ప్రసాద్, బొంతు కృష్ణారావు, తెలంగాణ ఉద్యమ జేఏసీ చైర్మన్ చిత్తలూరి ప్రసాద్, గురుజ్యోతి సంస్థ బాధ్యుడు దారా ఏసురత్నం, యూటీఎఫ్ నాయకులు నాగేశ్వరరావు, కొప్పు ల శ్రీనివాసరావు, మిస్ట్ సంస్థ చైర్మన్ కంచర్ల సత్యనారాయణ భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. శనివారం సత్తుపల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.