కంది, మార్చి 31: రెండే రెండు గంటల్లో బ్రిడ్జి కట్టేస్తే.. అదీ మనిషి అవసరం లేకుండానే పనంతా మెషీన్ పూర్తి చేస్తే.. అది సాధ్యమేనా! అన్న ఆలోచనలో పడిపోయారా? దేశీయ నిర్మాణరంగంలోనే కొత్త చరిత్రను లిఖిస్తూ ప్రొటోటైప్ 3డీ బ్రిడ్జిని రూపొందించాయి ఐఐటీ హైదరాబాద్, సింప్లిఫోర్జ్ క్రియేషన్స్. ఇది దేశంలోనే తొలి ప్రొటోటైప్ బ్రిడ్జి. ఐఐటీ హైదరాబాద్ సివిల్ ఇంజినీరింగ్ విభాగ ప్రొఫెసర్ కేవీఎల్ సుబ్రహ్మణ్యం తన పరిశోధన బృందంతో దీనికి రూపకల్పన చేశారు. 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ సొల్యూషన్స్ అందించడంలో ప్రత్యేకత కలిగిన స్టార్టప్ కంపెనీ సింప్లిఫోర్జ్ ఈ బ్రిడ్జిని ముద్రించింది. పాదచారుల కోసం రూపొందించిన ఈ బ్రిడ్జి లోడ్ టెస్టింగ్ దశలో ఉన్నది. కాంక్రీటు ఐఐటీ హైదరాబాద్లో ఈ వంతెనను తయారు చేశారు. మెటీరియల్ ఫాలోస్ ఫోర్స్ అనే పద్ధ్దతిని ఉపయోగించారు. ఈ ప్రాజెక్టు కోసం సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ ప్రత్యేకంగా ఎక్స్ట్రూషన్, సాఫ్ట్వేర్ సిస్టమ్ను అభివృద్ధి చేసింది. ఇండస్ట్ట్రియల్ రోబోటిక్ ఆర్మ్ 3డీ ప్రింటర్ని ఉపయోగించి సింప్లిఫోర్జ్ ప్రింటింగ్ ఫెసిలిటీలో 2 గంటల్లోనే బ్రిడ్జిని ప్రింట్ చేసి సిద్దిపేటలోని చర్విత మెడోస్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
నిర్మాణ రంగంలో అనూహ్య మార్పులు
నిర్మాణ రంగంలో ఈ టెక్నాలజీ అనూహ్య మార్పులు తీసుకొస్తుందని ఐఐటీహెచ్ ప్రొఫెసర్ సుబ్రమణ్యం ఆశాభావం వ్యక్తం చేశారు. 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ వాడకం ఊపందుకొంటుందని తెలిపారు. అతి తక్కువ వ్యవధిలో నిర్మాణాలు పూర్తి చేయగల సామర్థ్యం 3డీ కాంక్రీట్ టెక్నాలజీకి ఉన్నదని వెల్లడించారు. దీని ద్వారా మన అవసరాలకు తగ్గట్టు నిర్మాణాలు డిజైన్ చేసుకోవచ్చని, ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకొని నిలబడేలా నిర్మాణాలు ఉంటాయని వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు గర్వంగా ఉన్నదని సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ డైరెక్టర్ హరికృష్ణ జీడిపల్లి పేర్కొన్నారు.