హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): దేశంలోనే తొలి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ను రాయదుర్గంలో నిర్మించినట్టు విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. బుధవారం ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.1,400 కోట్లతో నిర్మించిన ఈ 400 కేవీ సబ్స్టేషన్ను త్వరలోనే సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు తెలిపారు. రాబోయే 30-40 ఏండ్ల హైదరాబాద్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్తు వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సబ్స్టేషన్తో హైదరాబాద్కు విద్యుత్తు వలయాన్ని ఏర్పాటు చేశామని, దీనితో ఒక్క క్షణం కూడా కరెంటు పోదని చెప్పారు. 400 కేవీ, 220 కేవీ, 133 కేవీ, 33 కేవీ సబ్ స్టేషన్లను ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయటం దీని ప్రత్యేకత అని వివరించారు. ఈ నాలుగు సబ్స్టేషన్లను ఏర్పాటు చేయడానికి 100 ఎకరాల స్థలం అవసరం అవుతుందని, కానీ 5 ఎకరాల్లోనే దీన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్కు 3 కిలోమీటర్ల దూరం వరకు కేబుళ్లను అండర్గ్రౌండ్ నుంచి ఏర్పాటు చేసినట్టు వివరించారు. దేశంలోనే తొలిసారి మోనోపోల్స్ కూడా మనమే వాడుతున్నామని, ట్రాన్స్కో ఆధ్వర్యంలో దీన్ని నిర్మించినట్టు వెల్లడించారు. ఈ సబ్స్టేషన్ నుంచి 2000 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు.
400 కేవీ సబ్స్టేషన్ నిర్మించాలంటే కనీసం 70 నుంచి 80 ఎకరాల స్థలం కావాలి. నగరంలో అంత స్థలం అందుబాటులో లేదు. ట్రాన్స్కో ఉన్నతాధికారులు వినూత్నంగా ఆలోచించి, 400 కేవీ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ను కేవలం 5 ఎకరాల్లోనే నిర్మించారు. ఈ తరహాలో 400 కేవీ సబ్స్టేషన్ను నిర్మించడం ఇదే మొదటిసారి. ఇందుకు తెలంగాణ వేదికగా మారడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.