హైదరాబాద్, (నమస్తే తెలంగాణ) / గీసుగొండ, ఏప్రిల్ 12: వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ధర్మారం శివారులోని టెస్కో గోదాములో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రూ.32.37 కోట్ల విలువైన వస్ర్తాలు దగ్ధమైనట్టు ఆ సంస్థ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా రామయ్యర్ తెలిపారు. కాలిపోయినవాటిలో కార్పెట్లు, బెడ్షీట్లు, టవల్స్, టీసీ షర్టింగ్ తదితర వస్ర్తాలు ఉన్నట్టు ఆమె మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గోడౌన్ వాచ్మన్ పర్యవేక్షణలోనే ఉన్నదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసు, అగ్నిమాపక శాఖలు విచారణ జరుపుతున్నాయని ఆమె వెల్లడించారు. టెస్కో కేంద్ర కార్యాలయం నుంచి కూడా అధికారుల బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని టెస్కో గోదాములు, షోరూమ్లకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా చేయించామని, బీమా కంపెనీ ద్వారా పరిహారాన్ని రాబట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె వివరించారు.