వనపర్తి, ఆగస్టు 16: వనపర్తి కాంగ్రెస్లో వర్గపోరు తారా స్థాయికి చేరింది. మాజీ మం త్రి చిన్నారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి వర్గీయులు తోపులాడుకున్నారు. మాటల యుద్ధం చేసుకున్నారు. వీరితోపాటు ఇటీవల హస్తం పార్టీలో చేరిన మరోనేత మేఘారెడ్డి మధ్య టికెట్ల లొల్లి నడుస్తున్న ది. ఈ నేపథ్యంలో.. బూత్లెవల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు పీవీ మోహన్, మాజీ ఎంపీ మల్లు రవి సమక్షంలో చిన్నారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వనపర్తి పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి అక్కడికి చేరుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులను పట్టించుకోకుండా.. కనీసం సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గ వ్యాప్తంగా కమిటీలను ఎలా వేస్తున్నారని నిలదీశారు. దీంతో చిన్నారెడ్డి, శివసేనారెడ్డి అనుచురుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అరగంట తర్వాత అక్కడికి చేరుకున్న పరిశీలకులు వారిద్దరికీ సర్దిచెప్పారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో చిన్నారెడ్డి ఐదు నెలల ముందు నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తారని, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్లీ నాలుగున్నరేండ్లు ఎవరికీ కనిపించకుండా పోవడం ఆయన నైజమని, దీంతో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతున్నదని ఓ సీనియర్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి చిన్నారెడ్డిని తప్పించి ఇతరులకు టికెట్ ఇచ్చి అవకాశం ఇవ్వాలని, అందరం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తామని చెప్పుకొచ్చారు. దీంతో చిన్నారెడ్డి వర్గం నేతలు ఒక్కసారిగా వాగ్వాదానికి తెర లేపారు. చిన్నారెడ్డి వర్గం ఒక వైపు.. మరోవైపు శివసేనారెడ్డి వర్గం రెండు గంటల పాటు రచ్చరచ్చ చేశారు. అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. చిన్నారెడ్డిని గెలిపిస్తామని ఆయన వర్గం నాయకులు చెప్తుంటే.. చిన్నారెడ్డికి టికెట్ ఇస్తే ఇప్పుడు ఉన్న మంత్రి నిరంజన్రెడ్డి ఇంట్లో కూర్చొని గెలుస్తారని శివసేనారెడ్డి వర్గం పేర్కొన్నది. శివసేనారెడ్డికి టికెట్ ఇస్తే అసలు ఎన్నికలే అవసరం లేదని, ఓటమి తథ్యమని మరో వర్గం విమర్శలు చేసింది. రెండు వర్గాలు విమర్శలు చేసుకుంటుంటే.. చిన్నారెడ్డి మౌనం పాటించారు. పీవీ మోహ న్, మాజీ ఎంపీ మల్లురవి చిన్నారెడ్డి, శివసేనారెడ్డి వర్గీయులకు ఎంత సర్దిచెప్పినా వినకపోవడంతో మౌనంగా కూర్చుండిపోయారు.