Fire Accidents | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఇటీవల వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ఆధునిక వాహనాలు, ఇతర సామగ్రిపై తెలంగాణ అగ్నిమాపకశాఖ దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు కొత్త వాహనాలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సుమారు రూ.100 కోట్ల విలువైన వాహనాలు, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అగ్నిమాపక శాఖ నివేదిక పంపింది. దక్కన్ మాల్ ప్రమాదం తర్వాత మంత్రి కేసీఆర్, సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో ఫైర్ సర్వీసెస్ శాఖకు కావల్సిన వాహనాలు, సామగ్రి కొనుగోలుకు సంబంధించి అధికారుల నుంచి ప్రతిపాదలను కోరారు. దీంతో హైదరాబాద్లో జరుగుతున్న అభివృద్ధి, నిర్మితమవుతున్న కొత్త బిల్డింగులు, పలు కంపెనీల భవనాలు, వాటి స్థాయి, ఎత్తును బట్టి విస్తృతంగా కసరత్తు చేసిన అగ్నిమాపక అధికారులు కొత్త వాహనాలు, అత్యాధునిక సాంకేతికతతో కూడిన వస్తు సామగ్రి, కావాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
హైదరాబాద్లో దాదాపు 100 మీటర్ల ఎత్తున్న బిల్డింగ్ల నిర్మాణం కూడా జరుగుతున్నది. ఆ భవనాల్లో ప్రమాదాలు సంభవిస్తే, వాటిని అరికట్టేందుకు మన దగ్గర ఉన్న వాహన, వస్తు సామగ్రి సరిపోవు. ప్రస్తుతం నగరంలో ఈ స్థాయి ఎత్తు భవనాలు 29 ఉండగా, త్వరలోనే మరో 407 బిల్డింగ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను దృష్టిలో ఉంచుకొని ఆధునిక వాహనాలు, వస్తు సామగ్రిని కొనుగోలు చేసేందుకు తెలంగాణ అగ్నిమాపక శాఖ సిద్ధమైంది.
90 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి రెస్క్యూతో పాటు ఫైర్ ఫైటింగ్ చేయగల హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ను అగ్నిమాపకశాఖ కొనుగోలు చేయనున్నది. 68 నుంచి 70 మీటర్ల ఎత్తు వరకు వెళ్లగల టర్న్ టేబుల్ నిచ్చెనను అందుబాటులోకి తీసుకురానున్నది. 43 మీటర్ల ఎత్తులో జరిగే ప్రమాదాల్లో 360 డిగ్రీల్లో ఎటువైపు నుంచైనా వెళ్లి ఫైర్ ఫైటింగ్ చేయగల మల్టీ ఆర్టిక్యులేటెడ్ వాటర్ టవర్ను రూ.7.50 కోట్లతో కొనుగోలు చేయనున్నది.
విపత్తులు సంభవించినప్పుడు పౌరుల ప్రాణాలు, ఆస్తులను కాపాడటం కోసం రాష్ట్ర అగ్నిమాపకశాఖ అహర్నిశలు కృషి చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా బ్రీతింగ్ అప్పారేటస్ సెట్స్ వ్యా న్, జీపులు, డ్రోన్లు, డికోసే జెట్ ఇంజిన్ బేస్డ్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, పోర్టబుల్ ఆక్సిజసోలైన్ కటింగ్ కిట్, లైఫ్ డిటెక్టర్స్, స్మోక్ ఎగ్జాస్టర్స్, డిజాస్టర్ డెప్లాయ్మెంట్ కిట్, అవగాహన కల్పించే వాహనాలు కావాలని కోరాం. రూ.100 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. నిధులు రాగానే వాహనాలు కొనుగోలు చేస్తాం.
– వై నాగిరెడ్డి, డైరెక్టర్ జనరల్, అగ్నిమాపకశాఖ