Hyderabad : హైదరాబాద్లోని నాంపల్లి రైల్వేస్టేషన్లో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. హైదరాబాద్–జైపూర్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. రెండు ఏసీ కోచుల్లో మంటలు చెలరేగాయి. బీ1, బీ2 ఏసీ కోచుల్లో మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
అయితే, ఆలోపే రెండు కోచులు చాలావరకు దగ్ధమయ్యాయి. అయినప్పటికీ మంటలు ఇతర కోచులకు వ్యాపించకుండా సిబ్బంది మంటలను ఆర్పేస్తున్నారు. రైలు బయల్దేరడానికి కొద్ది సేపటి ముందు ఈ ప్రమాదం జరిగింది. రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. నాంపల్లి రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న హైదరాబాద్–జైపూర్ ఎక్స్ప్రెస్ రైలులో సాయంత్రం 6.45 గంటలకు మంటలు చెలరేగాయి. బీ1, బీ2 అనే టైర్–3 ఏసీ కోచుల్లో ఈ మంటలు అంటుకున్నాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు. ఎవరూ గాయపడలేదు. అగ్నిప్రమాద సమయంలో కోచులలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సాయంత్రం 7.50 గంటలకు రైలు బయల్దేరాల్సి ఉంది. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గురైన కోచులను రైలు నుంచి విడదీశారు. వాటిని పరిశీలించి అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకోనున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో స్టేషన్లోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.