భువనగిరి కలెక్టరేట్, ఫిబ్రవరి 18 : భువనగిరి మండలం హన్మాపురంలోని 220 కేవీ విద్యుత్తు సబ్స్టేషన్లో శనివారం అర్ధరాత్రి సంభవించిన షార్ట్ సర్క్యూట్తో పెద్ద ప్రమాదం జరిగింది. విధుల్లో ఉన్న సిబ్బంది సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరకున్నారు. ఆలేరు, భువనగిరి అగ్నిమాపక సిబ్బంది మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ట్రాన్స్కో డైరెక్టర్ జగత్రెడ్డి, డీఈ దంతూరి మల్లికార్జున్గౌడ్ ఆదివారం ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. పలు విద్యుత్ పరికరాలు దగ్ధమయ్యాయని, రూ.5 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన విద్యుత్తు సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. మరోవైపు సబ్స్టేషన్ మరమ్మతులు చేపడుతున్నారు.