జగిత్యాల : జగిత్యాలలో ముగ్గురి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. 8 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వనం దుర్గయ్య, చిన్న గంగయ్య, మధు, పోచయ్య, శేఖర్, కందుల రాములు, పల్లాని భూమయ్య, కందుల శ్రీనుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిన్న జగిత్యాల జిల్లా కేంద్రంలోని తారకరామనగర్లో తండ్రి, ఇద్దరు కుమారులను హత్య చేసిన సంగతి తెలిసిందే. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. తారకరామనగర్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
తారకరామనగర్కు చెందిన జగన్నాథం నాగేశ్వర్రావు (60) స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తూ సెప్టిక్ క్లీనింగ్ వాహనాన్ని నిర్వహిస్తుంటారు. గురువారం స్థానిక ఎరుకల సంఘ భవనంలో నిర్వహించిన కుల సంఘం సమావేశానికి నాగేశ్వర్రావుతోపాటు ఆయన కొడుకులు రాంబాబు(42), రాజేశ్, రమేశ్ (35) హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగానే కొందరు వ్యక్తులు ఈ నలుగురిపై కత్తులు, బరిసెలతో అకస్మాత్తుగా దాడి చేశారు. నాగేశ్వర్రావును కత్తితో గొంతు కోయగా, రాంబాబు, రమేశ్ను బరిసెలతో పొడిచారు. తీవ్ర గాయాలపాలైన నాగేశ్వర్రావు, రాంబాబు అక్కడికక్కడే మృతిచెందారు. రమేశ్ను దవాఖానకు తరలిస్తుండగా మరణించాడు. రాజేశ్ త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. ముగ్గురిని హత్య చేసిన వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ హత్యలకు మంత్రాలు, ఆర్థిక లావాదేవీలు, సెప్టిక్ ట్యాంకుల నిర్వహణలో ఇతరులతో తలెత్తిన వివాదాలే కారణం కావచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.