ములుగు : ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయాన్ని బుధవారం ఆర్థికశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి సందర్శించారు. ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ గైడ్ ద్వారా రామప్ప శిల్ప కళా సౌందర్యాన్ని తెలుసుకున్నారు. గుడిలోని రాతి కట్టడాలను, శిల్పకళా నైపుణ్యాన్ని వీక్షించారు. పర్యాటరంగ అభివృద్ధి చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మండపంలో అర్చకులు శాలువాలతో సన్మానించి వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. రామప్ప చెరువు ప్రత్యేకత తో పాటు ఉపాలయాల పరిరక్షణకు, నిర్మాణాలకు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ వివరించారు.
ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ చెరువు కట్టపైనున్న ఆలయాలతో పాటు రామప్ప ఆలయానికి పశ్చిమ భాగంలో ఉన్న కాలభైరవుడి ఆలయాన్ని సందర్శించారు. వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై కంప్లీట్ డీపీఆర్ సమర్పించాల్సిందిగా రాష్ట్ర పురవాస్తు శాఖ అధికారులకు ఆదేశించారు. రామప్ప ఆలయ నిర్మాణం అద్భుతమన్నారు. రామప్ప ఆలయ సందర్శనకు వచ్చిన విద్యార్థులతో ఆమె కాసేపు ముచ్చటించారని, రామప్ప విశిష్టత అందరూ తెలుసుకొని ప్రతి విద్యార్థి ఒక ఆర్టికల్ రాసి తనకు పంపించాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు శాఖ ఏడీలు నర్సింగ్, మల్లు నాయక్, ఉమ్మడి జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్య కిరణ్, తహసీల్దార్ మంజుల, టూరిజం కార్పొరేషన్ మేనేజర్ అశోక్, ఏఎస్ఐ కృష్ణయ్య, టూరిజం రెవెన్యూ పోలీస్ పాల్గొన్నారు.