కమలాపూర్/హుజూరాబాద్ రూరల్, సెప్టెంబర్ 22: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పన్నులు వేయడం, సబ్సిడీలు రద్దు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. బీజేపీ ఏనాడైనా వెనుకబడినవర్గాల కోసం ఆలోచన చేసిందా? అని ప్రశ్నించారు. కేంద్రం లో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పా టుచేయాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రా నికి పంపితే ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మొర్రి ఓదెలుతోపాటు 50 మంది బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం వారందరికీ మంత్రి హరీశ్రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్కు చెందిన సుమారు 100 మంది యాదవులు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరారు. ఈ సం దర్భంగా హరీశ్రావు మీడియాతో మాట్లాడు తూ.. గౌడ కులస్తులకు మద్యం షాపుల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కేసీఆర్ దేనని చెప్పారు. గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ, చేనేత కార్మికులకు నేతన్నకు చేయూత వంటి పథకాలు పెట్టి బీసీలను ఆదుకున్నది టీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. ఇటువంటి ఆలోచన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏనాడైనా చేశాయా? అని నిలదీశారు. గొల్లకుర్మలు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ర్టాల్లో గొర్రె పిల్లలు పంపిణీ చేసిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు కుల వృత్తులను ధ్వంసం చేశాయని, హ్యాండ్లూం బోర్డు, ఆరోగ్య బీమా రద్దు చేశాయని మం డిపడ్డారు. బీసీల జనాభాను లెక్కించాలని అడుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. బీసీలను ఓట్ల కోసం వాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. యాదవులకు తమ ప్రభుత్వం గుర్తింపు నిచ్చిందని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ వంట గ్యాస్పై సబ్సిడీని ఎత్తివేయడంతోపాటు, పెట్రో లు, డీజిల్ ధరలు పెంచడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ అన్ని కులవృత్తులను ఆదుకునేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. రైల్వేలో ఉద్యోగుల సంఖ్య మూడు లక్షలకు తగ్గిపోయిందని, బీఎస్ఎన్ఎల్లో 50వేల మంది ఉపాధి కోల్పోయారని హరీశ్రావు తెలిపారు. బీజేపీ ఏంచేసిందని ఓట్లు అడుగుతున్నదని ప్రశ్నించారు. ఓటు అడిగే నైతిక హక్కు ఆ పార్టీకి లేదన్నారు.
ఈటల రాజేందర్కు టీఆర్ఎస్లో ఏ లోటు కలుగనీయలేదని, ఆయన తగిన గౌరవం ఇచ్చామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పరిగె అంటూ హేళనగా మాట్లాడారని మండిపడ్డారు. హుజూరాబాద్లో ఇప్పటికే గెల్లు శ్రీను గెలుపు ఖాయమైందని, మెజారిటీ లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నదని, టీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించా రు. టీఆర్ఎస్ కార్యకర్తలతో గ్రామాలవారీగా మంత్రి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఓయూ జేఏసీ నేత రాజారాంయాదవ్, మం డల ఇంచార్జి పేర్యాల రవీందర్రావు, సింగిల్ విండో చైర్మన్ సంపత్రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్ తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సంపత్రావు పాల్గొన్నారు.