పటాన్చెరు, జనవరి 7: కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుతో రిజర్వేషన్లకు ముప్పుపొంచి ఉన్నదని, ఈ విషయంలో గిరిజనులు ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ బంజారా ఎంప్లాయీస్ సేవా సంఘ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై.. యూనియన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక 6 శాతం ఉన్న రిజర్వేషన్ను 10 శాతానికి పెంచినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న 81 వేల ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ల అమలుతో బంజారాలకు భారీగా అవకాశాలు లభిస్తాయని చెప్పారు. గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుతో 206 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా వారికి వచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ఆర్టీఐ కమిషనర్ శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.