Minister Harish Rao | సంగారెడ్డి జూన్ 10 (నమస్తే తెలంగాణ): ధరణి రద్దు చేసి దళారుల రాజ్యం తీసుకురావాలని కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని, ఆ పార్టీ వస్తే బ్రోకర్లు రాజ్యం ఏలుతారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. అయితే, ప్రజలు కాంగ్రెస్ ఆటలు సాగనివ్వరని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగం గా శనివారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లో నిర్వహించిన సుపరిపాలన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్.. ధరణి లేకముందు రాష్ట్రంలో లెక్కలేనన్ని భూ సమస్యలు ఉండేవని, ధరణి వచ్చాక క్రమంగా భూ సమస్యలు పరిష్కారమైనట్టు తెలిపారు. ఇప్పుడు పైసా లంచం లేకుండా భూ క్రయవిక్రయాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
ధరణి వల్లే అర్హులైన 65 లక్షల మంది రైతులకు 8 విడతల్లో రూ.65 వేల కోట్ల రైతుబంధు డబ్బులు ఖాతాల్లో పడ్డాయని వివరించారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ పథకాలు వారి కార్యకర్తలు, అనుకూలురకే వర్తించేవని, బీఆర్ఎస్ పాలనలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. ధరణి ద్వారా మేలు జరుగుతున్నందున రైతు లు స్పందించారని హరీశ్ కోరారు. కాంగ్రెస్ ప్రజలను ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటుందని మండిపడ్డారు. 2004, 2014లో అధికారంలోకి వస్తే తండాలను పంచాయతీలుగా మారుస్తామని చెప్పి మాట తప్పిందని, కేసీఆర్ అధికారంలోకి రాగానే 2,500 తండాలను పంచాయతీలుగా మార్చి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు.
నాడు తెలంగాణకు అడ్డుపడ్డ ఆంధ్రానేతలు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని, తెలంగాణను అనవసరంగా వ్యతిరేకించామని మదనపడుతున్నారని మంత్రి హరీశ్ తెలిపారు. లగడపా టి రాజగోపాల్ సైతం తాను గుడ్డిగా తెలంగాణ ను వ్యతిరేకించానని పశ్చాత్తాప పడటంతోపా టు సీఎం కేసీఆర్ పాలన బాగుందని కితాబిచ్చారని వెల్లడించారు. ఇద్దరు సీఎంల పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ ఎల్లెంకల పడ్డదని అన్నారు. మాట మాట్లాడితే హైటెక్, తన అంత అడ్మినిస్ట్రేటర్ లేడని చెప్పుకున్న ఓ మాజీ సీఎం పాలన ను ఏపీ ప్రజలు కండ్లారా చూశారని ఎద్దేవా చేశారు.
‘తెలంగాణ ఏర్పడితే ఆగం అయితదని, మళ్లీ నక్సలైట్ల రాజ్యం వస్తదని, కరెంటు లేక చీక టి అయిపోతదని, హైదరాబాద్ అల్లకల్లోలం అయితదని ఆంధ్రానేతలు అనేవారు. కానీ, న క్సలైట్ల రాజ్యం రాలేదు. చీకట్లు కమ్ముకోలేదు. హైదరాబాద్ అల్లకల్లోలం కాలేదు. పైగా, శాంతి భద్రతల్లో దేశానికి రోల్మాడల్గా నిలిచింది. కరెంటు ఉత్పత్తిని పెంచి తెలంగాణను జిలుగు లు వెలుగుల రాష్ట్రంగా మలిచిన ఘనత సీఎం కేసీఆర్ది’ అని వెల్లడించారు. ఏపీ నేతలకు మాటలు ఎక్కువ, పని తక్కువ అని.. సీఎం కేసీఆర్ మాత్రం మాటలు తక్కువ, పని ఎక్కువ అని తేల్చి చెప్పారు.
తెలంగాణ వాసులు మహారాష్ట్ర, గుజరాత్కు వెళ్లి అక్కడి పరిస్థితులను కండ్లారా చూస్తే గానీ తెలంగాణ ఘనత ఏమిటో అర్థం కాదని అన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ ముందున్నదని వివరించారు. ఇటీవలే మహారాష్ట్రకు చెంది న 25 మంది సర్పంచులు సిద్దిపేటకు వచ్చి అక్కడి పరిస్థితులను వివరించారని తెలిపారు. ఇటీవలే అస్సాంలో ఫ్యాన్లు, ఏసీలు వాడొద్దని పిలుపు ఇస్తున్నారని వెల్లడించారు. మహారాష్ట్ర, తమిళనాడు ప్రజలు తమ సీఎంలను తెలంగాణ తరహా అభివృద్ధి, సంక్షేమ కా ర్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారని హరీశ్ తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు తెలంగాణ మాడ ల్ కావాలని డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. దీన్ని కేంద్రం తట్టుకోలేకపోతున్నదని, అందుకే తెలంగాణకు రావాల్సిన రూ.1.30 లక్షల కోట్ల నిధులను నిలిపివేసిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ హయాంలో ఇసుకపై ప్రభుత్వానికి రూ.5 కోట్ల ఆదాయం వస్తే, తెలంగాణ ఆవిర్భావం తర్వాత రూ.5,500 కోట్ల ఆదాయం వచ్చిందని, సుపరిపాలనకు ఇది నిదర్శనమని మంత్రి హరీశ్ అన్నారు. సంక్షేమ పథకాల డబ్బు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తారని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే, దేశానికి దిక్సూచిగా ఉండాలంటే కేసీఆర్ను మూడోసారి సీఎంను చేయాలని కోరారు.
తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతున్నదని, మిషన్భగీరథ, మిషన్ కాకతీయతోపాటు పలు పథకాలను కేంద్రం వేరే పేర్లతో అమలు చేస్తున్నదని మంత్రి హరీశ్ తెలిపారు. ఆర్థికశాఖలో ఆడిట్ డిపార్టుమెంట్ను ప్రభు త్వం వంద శాతం ఆన్లైన్ చేసిందని వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీన్ని మెచ్చుకొని తెలంగాణ తరహాలో దేశవ్యాప్తం గా ఆన్లైన్ ఆడిటింగ్ ప్రవేశపెట్టేందుకు కేంద్రమంత్రులతో సబ్కమిటీ వేసిందని, అందులో తెలంగాణ ఆడిట్ డైరెక్టర్ను సభ్యుడిగా చేర్చిందని వివరించారు.
‘కాంగ్రెస్ హయాంలో రైతులు చనిపోతే రూ.50 వేల ఆర్థిక సాయం ఇచ్చే ఆపద్బంధు పథకం ఉండేది. దరఖాస్తు పెట్టుకున్న ఏడాదికి పైసలు వచ్చేవి. నాడు నేను సిద్దిపేట ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు స్వయంగా కలెక్టరేట్కు వచ్చి ఆపద్బంధు పథకం చూసే సూపరింటెండెంట్ వద్దకు వెళ్లి దరఖాస్తుల గురించి తెలుసుకునేవాడిని. అక్కడి నుంచి డీఆర్వో, జేసీ, కలెక్టర్ను కలిసి ఆపద్భంధు ఫైల్స్ త్వరగా క్లియర్ చేయాలని కోరి దగ్గరుండి పని చేయించుకునేవాడిని. ఎమ్మెల్యే హోదాలో నేనే స్వయంగా సూపరింటెండెంట్ నుంచి కలెక్టర్ వరకు కలిస్తే కానీ ఆ డబ్బులు వచ్చేవి కావు.
ఇప్పుడు రైతుబీమా కింద దరఖాస్తు చేసుకుంటే రూ.5 లక్ష లు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. నాటికీ నేటికీ ఎంత మార్పు వచ్చిందనేది ప్రజ లు గమనించాలి. సుపరిపాలన అంటే ఇదీ. ఇది తెలంగాణ సాధించిన విజయం’ అని తెలిపారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, మాణిక్రావు, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్చైర్మన్ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
‘సిద్దిపేట ఎమ్మెల్యేగా నేను ప్రతిపక్షంలో ఉన్నా. నా నియోజకవర్గంలోని రాజ్గోపాల్పేటలో పెద్ద చెరువు ఉన్నది. ఆ గ్రామ నుంచి బెస్తలు ఓరోజు నా వద్దకు వచ్చి బాధలు చెప్పుకున్నారు. సర్ మేం విజయవాడ వెళ్లి డబ్బులు పెట్టి కొర్రమట్ట పిల్లలు తెచ్చి పెద్ద చెరువులో వేశామని, చె రువులో నీళ్లు లేక చేపలు పెరగటం లేదని, ఎలాగైనా చెరువులో రెండు బోర్లు వేయండని కో రారు. వారిని ఆదుకోవాలని పెద్ద చెరువులో రెండు బోర్లు వేయించా. 450 ఫీట్లకు నీళ్లు పడ్డా యి. నీటిని తోడేందుకు 7.5 హార్స్పవర్ రెండు మోటర్లు పెట్టేందుకు ఐదు కరెంటు స్తంభాలు, ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టించా. కొన్నిరోజులు నడిచిన ఆ బోర్లు ఆ తర్వాత నీళ్లు పోయలేదు. ఉన్న నీటిలోనే చేపలు పెరిగినా బెస్తలు నష్టపోవాల్సి వచ్చింది.
మూడు నెలల క్రితం రాజ్గోపాల్పే ట బెస్తలు మళ్లీ నా వద్దకు వచ్చారు. సర్ కాళేశ్వరం నీళ్లతో మా పెద్దచెరువు పొంగి పొర్లుతున్న ది. ఎండాకాలంలో కూడా నిండుగా ఉన్నది. చేపలు కిందికి పోయి చిక్కడం లేదు. ఎలాగైనా చెరువు ఖాళీ చేయించాలే అని వేడుకున్నారు. వారి మాటలు విని నాకు నవ్వొచ్చింది. ఒకప్పు డు చెరువు ఎండిపోతే బోర్లు వేయించిన నేను.. ఇప్పుడు ఎండాకాలంలోనూ చెరువు జలకళ సంతరించుకోవటం చూసి సంతోషం అనిపించింది’ అని మంత్రి నాటి, నేటి స్వీయ అనుభవాలను వెల్లడించారు.
కేపీహెచ్బీ కాలనీ, జూన్ 10: పేదలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు కొనియాడా రు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ దవాఖానల్లోనే 70 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని, తొమ్మిదేండ్లలోనే 20 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. శ నివారం కూకట్పల్లిలోని కేపీహెచ్బీ కాలనీ 5వ ఫేజ్లో 100 పడకల ఏరియా దవాఖానకు మంత్రి హరీశ్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గర్భిణులకు ఈ నెల 14 నుంచి న్యూట్రిషన్ కిట్లు అందజేస్తామని చెప్పారు. పౌష్ఠికాహారంతో కూడి న కిట్ను 4వ, 7వ నెలలో ఇవ్వనున్నట్టు తె లిపారు. ప్రస్తుతం 6.80 లక్షల గర్భిణులకు ఈ కిట్లు పంపిణీ చేస్తామని వివరించారు.
గతంలో విద్యార్థులు వైద్య విద్య కోసం ఉక్రెయిన్, రష్యా దేశాలకు వెళ్లేవారని, ఇప్పుడు రాష్ట్రంలో 8,340 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. జిల్లాకొక సూపర్ స్పెషాలిటీ దవాఖానను, హైదరాబాద్లో బస్తీకొక దవాఖానను అందుబాటులోకి తెచ్చినట్టు వివరించారు. మెడికల్ కాలేజీలకు అనుమతులిచ్చి, తామే వాటిని ఏర్పాటు చేసినట్టు చెప్పుకోవటంపై మండిపడ్డారు. 157 మెడికల్ కాలేజీలకు అనుమతిచ్చిన కేంద్రం.. రాష్ర్టానికి ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పాలన బాగున్నదని ఢిల్లీలో అవార్డులిస్తున్న బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్ర గల్లీల్లో మా త్రం పాలన బాగాలేదని విమర్శలు చేయ టం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. చిన్న పనుల కే మోదీ బొమ్మ పెట్టాలని అడుగుతున్న బీ జేపీ నేతలు.. గ్యాస్ సిలిండర్లకు కూడా మో దీ బొమ్మ పెడితే బాగుంటుందని చురక అంటించారు. కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పటాన్చె రు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీలు కూర్మయ్యగారి నవీన్కుమార్, శంభీపూర్ రాజు, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ పాల్గొన్నారు.