Gurukul Recruitment | హైదరాబాద్, ఫిబ్రవరి11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ గురుకులాల్లోని ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగమాగం గందరగోళంగా మారింది. జేఎల్, డీఎల్ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాతే పీజీటీ, టీజీటీ తదితర పోస్టులను భర్తీచేస్తామని ప్రకటించిన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు(ట్రిబ్) ఇప్పుడు అందుకు విరుద్ధంగా హడావుడిగా పీజీటీల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించింది. ఏమాత్రం ప్రణాళిక లేకుండా ఒక్క రోజు ముందుగానే మెరిట్ జాబితా ప్రకటించి 1ః2 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలుపెట్టింది.
జేఎల్, డీఎల్ వదిలి నేరుగా పీజీటీ..!
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో కలిపి మొత్తంగా 9 క్యాటగిరీల్లో పీజీటీ 1,276, టీజీటీ 4,020, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ 2,876, టీజీటీ స్కూల్ లైబ్రేరియన్ 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 226, మ్యూజిక్ టీచర్ 124 పోస్టులు కలిపి మొత్తం 9,231 పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ఆగస్టులో నిర్వహించిన రాత పరీక్షకు అన్ని పోస్టులకు కలిపి 6,52,413 మంది దరఖాస్తు చేసుకోగా 4,93,727 మంది పరీక్షకు హాజరయ్యారు.
జోనల్స్థాయి పోస్టులైన టీజీటీ, స్కూల్పీడీ, లైబ్రేరియన్, ఆర్ట్అండ్క్రాఫ్ట్, మల్టీజోనల్ పోస్టులైన గురుకుల డీఎల్, జేఎల్, పీజీటీ అభ్యర్థుల నుంచి ఆప్షన్లను ట్రిబ్ స్వీకరించింది. వాటి ఆధారంగా ఆయా పోస్టుల వారీగా 1ః2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను కూడా సిద్ధం చేసింది. అదే సమయంలో ఎన్నికల కోడ్ అడ్డురావడం, కోర్టు కేసుల నేపథ్యంలో నియామక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం మళ్లీ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత డిగ్రీ లెక్చరర్, ఆపై జేఎల్, పీజీటీ, టీజీటీకి సంబంధించిన పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.
గురుకుల పోస్టులకు సంబంధించి అభ్యర్థులు తమ అర్హతలను బట్టి రెండుకంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. పైస్థాయి నుంచి పోస్టులను భర్తీ చేయడం వల్ల మళ్లీ ఖాళీలు ఏర్పడే అవకాశం ఉండబోదని పలుమార్లు వెల్లడించింది. ఆ దిశగానే పోస్టుల భర్తీ ప్రక్రియకు సన్నాహాలు చేసింది. అందులో భాగంగా తొలుత గురుకుల డీఎల్ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసి, 1ః2నిష్పత్తిలో అభ్యర్థులను డెమోకు పిలవాలని నిర్ణయించి ఏర్పాట్లు కూడా చేసుకున్నది. ఇప్పుడేమో అందుకు విరుద్ధంగా నేరుగా పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్ అభ్యర్థుల ఎంపికకు ఉపక్రమించింది. అందుకు సంబంధించి అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టింది.
ఒకే రోజు అన్ని సబ్జెక్టులకు..
పీజీటీకి సంబంధించి ట్రిబ్ ఎలాంటి ప్రణాళిక లేకుండా ఒక్కరోజునే దాదాపు అన్ని సబ్జెక్టుల అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలిచారు. మొత్తంగా 1276 పోస్టులకు గాను 1ః2 పద్ధతిలో 2500మందికిపైగా అభ్యర్థులను ధ్రవపత్రాల పరిశీలనకు పిలిచారు. బంజారాహిల్స్లోని కుమ్రంభీం ఆదివాసీభవన్లో తెలుగు, ఇంగ్లిష్, ఫిజికల్సైన్స్, పక్కనే ఉన్న బంజారాభవన్లో మ్యాథమెటిక్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్సైన్స్ సబ్జెక్టుల అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు.
అభ్యర్థులు తొలుత క్యాస్ట్ వెరిఫికేషన్ నిర్వహించుకుని, బయోమెట్రిక్ తీసుకుని, ఆ తరువాత సర్టిఫికెట్ వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని, తిరిగి సర్టిఫికేషన్, బయోమెట్రిక్, క్యాంప్ కన్వీనర్ సంతకాలు చేయించుకుని, అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలని వెల్లడించింది. కానీ ఎక్కడా క్రమపద్ధతి అన్నదే లేకుండా ఇష్టారాజ్యంగా నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ఆ ప్రక్రియను ప్రారంభించలేదు. ఆ తరువాత ప్రారంభించినా అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. చంటిపిల్లలతో వచ్చిన మహిళా అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు. రోజుకు ఒకటి రెండు సబ్జెక్టులకు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టకుండా ఒకేరోజున అన్ని సబ్జెక్టులకు నిర్వహించడంపై అభ్యర్థులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ప్రచారకాంక్ష కోసమేనా!
ప్రభుత్వ ఒత్తిడి మేరకు ట్రిబ్ ఆగమేఘాల మీద సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టినట్టు తెలుస్తున్నది. 14న పోలీసులు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ చేతుల మీదుగా నియామకపత్రాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పనిలోపనిగా ఇప్పటికే గురుకుల ఉపాధ్యాయ, లెక్చరర్ పోస్టులకు ఎంపికైన వారికి కూడా నియామక పత్రాలు అందివ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ నుంచి ట్రిబ్, టీఎస్ఎల్పీఆర్బీకి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఒత్తిడి మేరకు ట్రిబ్ వెంటనే నియామక ప్రక్రియ చేపట్టినట్టు తెలుస్తున్నది. డీఎల్, జేఎల్ పోస్టులను భర్తీ చేయాలంటే ముందుగా ఆయా అభ్యర్థుల నుంచి డెమోలను స్వీకరించాల్సి ఉంది. దానికి సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉండడంతో నేరుగా పీజీటీ పోస్టుల భర్తీకి ట్రిబ్ ఉపక్రమించింది. ప్రచారం కోసమే ప్రభుత్వం ఇలా ట్రిబ్ను పరుగులు పెట్టిస్తున్నదని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ ఖాళీలు తప్పవా..!
ప్రస్తుతం పీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు, రేపు జేఎల్, డీఎల్కు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. అలాంటి సందర్భంలో పీజీటీ వదులుకుని చాలామంది అభ్యర్థులు జేఎల్, డీఎల్వైపు మొగ్గుచూపుతారు. అదే జరిగితే మళ్లీ పీజీటీ పోస్టులు భారీగా ఖాళీ అయ్యే అవకాశముంది. ముందుగా జేఎల్, డీఎల్ నియామకం చేపడితే, ఆ తరువాత పీజీటీ పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్కు రావాల్సిన అవసరం ఉండబోదని, కానీ ఇప్పుడు మళ్లీ జేఎల్, డీఎల్ పోస్టులకు కూడా రావాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కరోజు ముందు మెసేజ్లు
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం హాజరుకావాలంటూ అధికారులు ఒక్క రోజు ముందు అభ్యర్థులకు సందేశాలు పంపడం గందరగోళానికి కారణమైంది. గురుకుల జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులకు 9,10 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను చేపట్టగా, వారికి 7న సాయంత్రం సందేశాలు పంపారు. తాజాగా పీజీటీ పోస్టులకు సంబంధించి 9వ తేదీ సాయంత్రం సందేశాలను పంపి 11వ తేదీ ఉదయమే సర్టిఫికెట్ వెరిఫికేషన్ హాజరుకావాలని ఆదేశించారు.
ఒక్కరోజు కూడా పూర్తిగా సమయమివ్వకుండానే ఆగమేఘాల మీద ధ్రువపత్రాల పరిశీలన చేపట్టడంపై అభ్యర్థులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్హతలు, కులం, నాన్ క్రీమిలేయర్ తదితర సర్టిఫికెట్లతోపాటు, అటెస్టేషన్ ఫారమ్ను రెండు సెట్ల జిరాక్స్ తీసుకుని రావాలని కోరింది. చాలామంది అభ్యర్థులు సరైన అవగాహన లేక విద్యార్హతల సర్టిఫికెట్లతోనే వచ్చారు. ఇక్కడికి వచ్చాక అటెస్టేషన్ ఫారమ్పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలని అధికారులు చెప్పడంతో అభ్యర్థుల పడిన అవస్థలు అన్నీఇన్నీ కావు. అటెస్టేషన్ కోసం ఆదివారం హైదరాబాద్ రోడ్లపై అనేకమంది అభ్యర్థులు పరుగులు తీశారు.