హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేస్తున్నామని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం విద్యార్థి ఒకటి నుంచి ఏడో తరగతి వరకు వరుసగా అక్కడ చదివితేనే ఆ రాష్ట్రంలో స్థానికత వర్తిస్తుందని కమిషన్ తరఫున ప్రత్యేక న్యాయవాది సంజయ్కుమార్ డివిజన్ బెంచ్కు నివేదించారు. ఏ ఒక్క తరగతి బయట చదివినా నాన్ లోకల్ కింద పరిగణిస్తామని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ ఇచ్చిన గ్రూప్- 1 నోటిఫికేషన్లో రాష్ట్రపతి ఉత్తర్వులు, 95 శాతం స్థానిక కోటా వర్తింపునకు సంబంధించి సమగ్ర సమాచారం ఉందని చెప్పారు. రాష్ట్రంలో 503 గ్రూప్- 1 ఉద్యోగాల భర్తీకి గత ఏడాది ఏప్రిల్ 26వ తేదీన టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.
కాగా, ఏపీలోని విశాఖపట్నంలో ఆరో తరగతి చదివిన ఓ అభ్యర్థి తెలంగాణలో తనను లోకల్గా పరిగణించాలని రిట్ పిటిషన్ దాఖలు చేయగా, సింగిల్ జడ్జి సానుకూలంగా ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ పుల్లా కార్తీక్తో కూడిన డివిజన్ బెంచ్ను సంజయ్కుమార్ కోరారు. గ్రూప్ -1 ఉద్యోగానికి డిగ్రీ విద్యార్హత కాబట్టి చివరి నాలుగేండ్లు తెలంగాణలో చదివితే స్థానికత వర్తిస్తుందని ఆ అభ్యర్థి చేసిన అభ్యర్థన సరైంది కాదని వాదించారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారని, వెంటనే రద్దు చేయాలని కోరారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ద్విసభ్య ధర్మాసనం ఎదుట టీఎస్పీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, తదుపరి వాదనలు నేడు (బుధవారం) కొనసాగనున్నాయి.
కోర్టు కేసువల్లే గ్రూప్ 1 రిజల్ట్స్ జాప్యం
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేస్తున్నాం. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఇక్కడ చదివినవారినే లోక్లగా పరిగణిస్తున్నాం. రాష్ట్రపతి ఉత్తర్వులను నోటిఫికేషన్లో పొందుపరిచాం. అక్టోబర్లోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఇవ్వాలని అనుకున్నా..కోర్టు కేసు వల్ల జాప్యం జరుగుతున్నది. ఈ కేసు రెండు, మూడు రోజుల్లో కొలిక్కే వచ్చే అవకాశం ఉన్నది. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేస్తాం. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మెయిన్స్ పరీక్షకు సనద్ధమయ్యేందుకు మూడు నెలల సమయం ఇస్తాం.
– బీ జనార్దన్రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్