హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ)/కొండాపూర్: అమ్మ జన్మనిస్తే.. పునర్జన్మ ఇచ్చే అవకాశం కేవలం డాక్టర్లకే ఉన్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. డబ్బుతో ఏదైనా కొనగలమని కొందరు భ్రమల్లో ఉంటారని, ధనంతో వస్తువులను పొందగలమే తప్ప ప్రాణాన్ని కొనలేమని అన్నారు. అంతటి విలువైన ప్రాణాన్ని కాపాడే అవకాశం కేవలం వైద్యులకే ఉన్నదని చెప్పారు. అందుకే పెద్దలు వైద్యో నారాయణో హరి అంటారని చెప్పారు. వైద్యారోగ్యశాఖలో కొత్తగా నియమితులైన 929 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు మంత్రి హరీశ్రావు శనివారం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రకటించిన 80 వేల ఉద్యోగాల్లో మొదటగా కొలువులు పొందింది సివిల్ అసిస్టెంట్ సర్జన్లేనని చెప్పారు. కేవలం ఆరు నెలల్లోనే నియామక ప్రక్రియ పూర్తయిందని గుర్తుచేశారు. ప్రభుత్వ వైద్యులుగా కొత్త సంవత్సరంలో కొత్త ఉద్యోగం, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న 929 మందికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. వైద్యారోగ్యశాఖ ద్వారా నిరుపేదలకు మంచి వైద్యం అందించాలని పిలుపునిచ్చారు. కొత్త సంవత్సరం మొదటి రోజే ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన జ్ఞాపకం మిగుల్చుకోవాలని సూచించారు. వీలైనంత వరకు పోస్టింగ్ వచ్చిన దగ్గరే నివాసం ఉండాలని, సమయపాలన పాటించాలని కోరారు. మంచి పలకరింపు, ఆత్మీయత సగం రోగాన్ని దూరం చేస్తుందని చెప్పారు.
అత్యంత పారదర్శకంగా నియామకాలు
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ చరిత్రలో ఇంత పారదర్శకంగా ఒకేసారి ఇన్ని ఉద్యోగాలకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి అని మంత్రి హరీశ్రావు చెప్పారు. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) ఎలాంటి వివాదాలు, పైరవీలు లేకుండా 929 మందికి పోస్టింగ్ ఇచ్చిందని చెప్తూ బోర్డు చైర్మన్ రిజ్వీ, కార్యదర్శి గోపీకాంత్రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాసరావును ప్రత్యేకంగా అభినందించారు. వైద్యారోగ్యశాఖలో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పారు. మొత్తంగా రాబోయే ఆరు నెలల్లో వైద్యారోగ్యశాఖలో 10,283 ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు వైద్యారోగ్యశాఖలో 21,202 నియామకాలు జరిగాయని పేర్కొన్నారు. శాఖలో ఒక ఖాళీ కూడా ఉండొద్దు, మందుల కొరత ఉండొద్దు, నాణ్యమైన వైద్యం అందించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని స్పష్టంచేశారు.
డాక్టర్ల శ్రమకు తగిన గుర్తింపు
వైద్యుల శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తున్నదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో చాలామంది కాంట్రాక్ట్ డాక్టర్లు ప్రాణాలకు తెగించి పనిచేశారని ప్రశంసించారు. గతంలో తాను సూర్యాపేటకు వెళ్లినప్పుడు ఒక వైద్యురాలు ‘సార్.. మేము ప్రాణాలకు తెగించి కరోనా కాలంలో పనిచేశాం. రెగ్యులర్ ఉద్యోగాల్లో మాకు ప్రాధాన్యం ఇస్తారా?’ అని అడిగారని గుర్తు చేసుకున్నారు. కరోనా సమయంలో పనిచేసిన డాక్టర్లకు రెగ్యులర్ రిక్రూట్మెంట్లో వెయిటేజీ ఇస్తామన్న హామీని అమలు చేశామని చెప్పారు. దీంతో గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారు, కరోనా సమయంలో పనిచేసిన వారు చాలామంది ప్రభుత్వ వైద్యులుగా మారారని పేర్కొన్నారు. ఇకపై బాగా పనిచేసి, మంచి ఫలితాలు తీసుకొచ్చే డాక్టర్లకు బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇచ్చారు. బదిలీలకు సైతం కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అభయమిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులకు పీజీ సీట్లలో 20-40 శాతం రిజర్వేషన్ కల్పించామని చెప్పారు. దీంతో ఒక రూపాయి ఖర్చు లేకుండా పీజీ పూర్తి చేస్తున్నారని చెప్పారు. పీజీ పూర్తి చేసిన వారి పోస్ట్ను అప్గ్రేడ్ చేసి టీవీవీపీ, డీఎంఈ పరిధిలోకి తీసుకుంటున్నామని వివరించారు. ఆరోగ్యశ్రీ సేవలను పీహెచ్సీలకు సైతం విస్తరించామని, సేవలకు తగినట్టుగా వేతనంతోపాటు ఇన్సెంటివ్ అందజేస్తామని చెప్పారు.
అగ్రపథాన దూసుకెళ్తున్న తెలంగాణ
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వైద్య రంగం దేశంలోనే అగ్రస్థానానికి దూసుకెళ్తున్నదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని, తలసరి ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని తెలిపారు. బీజేపీ రాష్ర్టాల్లో లక్ష జనాభాకు 9 మంది డాక్టర్లే ఉన్నారని పేర్కొన్నారు. తలసరి పీజీ సీట్లలో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని, లక్ష జనాభాకు 2.77 మంది పీజీ డాక్టర్లు తయారవుతున్నారని వివరించారు. నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీ ప్రకారం మెడికల్ సర్వీసెస్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉన్నదని, కేంద్రం లెక్కల ప్రకారం మాతృమరణాల రేటులో మూడో స్థానంలో ఉన్నామని వివరించారు. ఎంఎంఆర్ను 92 నుంచి 43కు తగ్గించామని చెప్పారు. అందరం సమిష్టిగా కృషి చేసి అన్ని విభాగాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మెడికల్ కాలేజీల సంఖ్య 5 నుంచి 17కు పెరిగాయని, దీంతో రాష్ట్రంలో ఏటా 6,615 మంది డాక్టర్లను తయారుచేస్తున్నామని చెప్పారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పూర్తయితే వైద్య సదుపాయాలు మరింత మెరుగుపడుతాయని, ఎకువ సంఖ్యలో ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైన్ నీళ్లు, నిధులు, నియామకాలకు సీఎం కేసీఆర్ పూర్తి న్యాయం చేశారని వివరించారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీపీహెచ్ శ్రీనివాసరావు, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతామహంతి, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, ఎంహెచ్ఎస్ఆర్బీ కార్యదర్శి గోపీకాంత్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పాకాల కుటుంబ సభ్యులకు హరీశ్ పరామర్శ
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): రిటైర్డ్ అటవీ అధికారి పాకాల హరినాథ్రావు కుటుంబ సభ్యులను మంత్రి హరీశ్రావు శనివారం పరామర్శించారు. మూడు రోజుల కిందట అనారోగ్యంతో హరినాథ్రావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. హరినాథ్రావు.. మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమకు తండ్రి. ఈ సందర్భంగా శైలిమను హరీశ్రావు ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. హరినాథ్రావుతో అనుబంధాన్ని గుర్తుచేసుకొన్నారు.