నిర్మల్, ఏప్రిల్ 7: రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే దాకా రైతుల పక్షాన పోరాడుతామని అటవీ, పర్యావర శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్తో మంత్రి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పంజాబ్ తరహాలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.
కేంద్ర వైఖరిని ముందే గమనించిన సీఎం కేసీఆర్ వరి పంటను తగ్గించాలని రైతులకు సూచిస్తే రాష్ట్రంలోని బీజేపీ నాయకులు తాము బాజాప్తా కొనుగోలు చేస్తామని చెప్పి నేడు రైతులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులకు తెలంగాణ రైతుల మీద నిజమైన ప్రేమ ఉంటే కేంద్రాన్ని ఒప్పించి ధాన్యం కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు.
టీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, జాతీయ రహదారులపై రాస్తారోకో చేశామన్నారు. శుక్రవారం ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మల దహనం, ఇండ్లపై నల్ల జెండా ఎగురవేసి నిరసన తెలుపాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. మున్సిపాలిటీల్లో పెద్దఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి కేంద్ర వైఖరిని ఎండగట్టాలని సూచించారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కె. విజయలక్ష్మి రెడ్డి, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ నల్లా వెంకట్రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.