శంషాబాద్ రూరల్, ఆగస్టు 24: విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు మద్యం మత్తులో తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసిన ఘటన గురువారం చోటుచేసుకొన్నది. దోహా నుంచి హైదరాబాద్ (శంషాబాద్) ఎయిర్పోర్టుకు వచ్చే 6ఈ 1314 నంబర్ గల ఇండిగో విమానంలో ఎయిర్లైన్స్ సిబ్బంది అందజేసిన మద్యం కాకుండా నలుగురు ప్రయాణికులు స్వయంగా తెచ్చుకొన్న మద్యం సేవించసాగారు.
గమనించిన తోటి ప్రయాణికులు ఎయిర్లైన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వారించినా వినకుండా హల్చల్ చేస్తూ ఇబ్బందులకు గురిచేశారు. దీంతో విమానంలో విధుల్లో ఉన్న సిబ్బంది ఆ నలుగురు ప్రయాణికులపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.