జగిత్యాల కలెక్టరేట్, మే 5: బావమరుదుల కొట్లాటకు బావ బలయ్యాడు. ఈ ఘటన శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. టౌన్ సీఐ రాంచందర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన వజీరుకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కూతురికి వివాహమైంది. వజీరు చిన్న కొడుకు తాజ్తో కలిసి జగిత్యాల పట్టణంలోని విజయపురి కాలనీలో నివసిస్తున్నది. వీరి ఇంటికి సమీపంలోనే కూతురు, అల్లుడు కూడా ఉంటున్నారు. ఆమెకు ప్రతి నెలా రూ.2 వేల ఆసరా పెన్షన్ వస్తున్నది. తల్లికి వచ్చే పెన్షన్ను వజీరు రెండో కొడుకు షేక్ హయత్ లాక్కెళ్లేవాడు. ఈ క్రమంలో షేక్ హయత్ ప్రతి నెలా తమ్ముడితో గొడవ పడుతుండేవాడు. వీరిద్దరు గొడవ పడకుండా బావ నయీమ్ ప్రయత్నించేవాడు. సయ్యద్ హయత్ శుక్రవారం తల్లి వద్దకు వచ్చి పెన్షన్ డబ్బులు లాక్కెళ్లే క్రమంలో తమ్ముడు తాజ్ అడ్డుపడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండటంతో అక్కడే ఉన్న వీరి బావ నయీమ్ వీరిని ఆపే ప్రయత్నం చేశాడు. ప్రతిసారి అడ్డుపడుతున్నాడనే కోపంతో హయత్ బావ తలను గోడకేసి బలంగా కొట్టాడు. దీంతో నయీం తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న జగిత్యాల టౌన్ సీఐ రాంచందర్రావు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి భార్య షబానా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.