మహబూబాబాద్ రూరల్ : టమాట కూర ఓ ఇంట్లో చిచ్చుపెట్టింది. ఈ క్రమంలో అత్తాకోడళ్ల మధ్య చోటు చేసుకున్న గొడవ.. కన్న తల్లిపై కొడుకు చేయిచేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన మహబూబాబాద్ మండల శివారులో శనివారం వెలుగు చూసింది.
స్థానికుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని వేంనూరు గ్రామానికి చెందిన ఇస్లావత్ బుజ్జి, బిచ్చా దంపతలు, వారి కొడుకు మహేందర్, కోడలు నందిని అందరూ కలిసి ఉమ్మడిగా ఉంటున్నారు. కాగా, శుక్రవారం రాత్రి కోడలు నందిని వండిన టమాట కూర బాగా లేదని అత్త గొడవ చేసింది. సుతారి పనికి వెళ్లి వచ్చిన భర్తతో నందిని తగాదా గురించి చెప్పడంతో మళ్లీ ఇంట్లో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మనస్తాపంతో కోడలు నందిని శనివారం ఉదయం తన పుట్టినిల్లు సాంక్రియా తండాకు వెళ్లింది. కూర మంచిగా వండ లేదని గొడవ పడడం వల్లే తన భార్య పుట్టింటికి వెళ్లిందన్న కోపంతో కొడుకు మహేందర్ సుత్తితో తల్లి తలపై కొట్టాడు. తలకు గాయమవడంతో చికిత్స నిమిత్తం వెంటనే ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు.