హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ)/ఖమ్మం: రాష్ట్రం లో పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు అటవీ, గిరిజన సంక్షేమశాఖల ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటైన అధికార బృందం క్షేత్రస్థాయి అధ్యయనాన్ని మొదలుపెట్టింది. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ శోభ, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, సీఎం ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్తో కూడిన ఈ బృందం మూడు రోజుల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా బుధవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ జిల్లాలను సందర్శించింది.
ఆయా జిల్లాల్లో పోడు భూముల పరిస్థితి, ఎంత శాతం అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేస్తున్నారు? అనే సమాచారాన్ని తెలుసుకొన్నది. అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఫారెస్ట్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, టీడీవోలు, డీపీవోలు, ఆర్డీవోలు, ఎఫ్బీవోలు, ఎఫ్ఎస్వోలు, తాసిల్దార్లతో ఖమ్మం కలెక్టరేట్లో సమావేశమైంది. ఆర్వోఎఫ్ఆర్, అటవీ ప్రాంతాల్లోని ప్రజల తరలింపు, పునరావాసం (ఆర్అండ్ఆర్), అటవీ భూముల రక్షణ, అడవుల పునరుద్ధరణ, అర్బన్ ఫారెస్టులు, అడవి బయట మొక్కల పెంపకం లాంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. గురువారం ఈ బృందం నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో.. శుక్రవారం ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించనున్నది.