కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా బతుకులు బంగారం లెక్క ఉండె. కాంగ్రెసోళ్లు వచ్చి ఎవుసాన్ని నాశనం జేసిండ్రు. అట్ల చేస్తం.. ఇట్ల చేస్తమని ఎన్నెన్ని చెప్పినవ్.. ఇప్పుడు మమ్ముల్ని ఎందుకు గోస వుచ్చుకుంటున్నవు. ఏం జేస్తనని వచ్చినవ్? ఇప్పుడేం జేస్తున్నవ్? నీ చేసుడుకు గత్తర రాను.. ఇసోంటోనివి ఎందుకొచ్చినవ్? మాకు ఇంత ఇసం పోసి పో.. ఎనెన్ని చెప్పినవ్.. ఎందుకు మమ్ముల ముంచుతున్నవ్. నువ్వు మనిషివైతే ఇటోసారి వచ్చి మా పంటలు చూసి మాట్లాడు. కౌలుకు చేసుకుంటున్నం.. లాగోడి ఎవలు కట్టాలె? లేనోళ్లం. పిల్లల ఫీజులు కట్టుడెట్ల? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతుబంధు వచ్చింది, పింఛన్ వచ్చింది. ఇప్పుడవి ఏడ వోయినయ్? – రైతు జంగా నరసవ్వ ఆక్రోశం
Sircilla | కరీంనగర్, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన రైతు జంగా నరసవ్వ ఏడెకరాల్లో వరిసాగు చేసింది. వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే కొనేవారు లేక రోజుల తరబడి నిరీక్షించింది. ఈ నేపథ్యంలో అకాలవర్షానికి వడ్లు మొలకలు వచ్చాయి. తడిసిన ధాన్యాన్ని చూసి తల్లడిల్లిన నరసవ్వ ప్రభుత్వాన్ని తూర్పారబట్టింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా కల్లాల్లో రైతుల నుంచి ఇదే ఆగ్రహం వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో 90శాతం ధాన్యం కొనుగోలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తేనే కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ చూసినా వడ్ల కుప్పలు పేరుకుపోయి కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో జోకిన వడ్లను కూడా తరలించడం లేదు. వర్షానికి తడిస్తే రైతులదే బాధ్యత అంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.
అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తుతున్నాయి. రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు చేయాల్సి ఉందని రైతు సంఘాల నాయకులు చెప్తున్నారు. ఇందులో ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే దాదాపు 54 వేల పైచిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉందని అధికారులే తెలిపారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు దారుణంగా మారాయి. గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులను హడలెత్తిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కొనుగోళ్లను వేగవంతం చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రైతు భోరున విలపిస్తున్నారు. ఇప్పటికైనా రైతుల గోడును అర్థం చేసుకొని, యుద్ధప్రాతిపదిక కొనుగోళ్లు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా షరతులు లేకుండా కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
ఆవేదనతో రోడ్డెక్కిన అన్నదాతలు
కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యంతో రైతులు విసిగివేసారిపోతున్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం పండించి, కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే ఎందుకు కొనడంలేదని ప్రశ్నించారు. అధికారులను అడిగితే రేపుమాపు అంటూ సమాధానం చెప్తున్నారని, వర్షానికి తడిసి, ధాన్యం మొలకెత్తిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు తమకు చావే శరణ్యమంటూ పురుగుమందు డబ్బాలు పట్టుకొని నిమ్మపల్లి ఎక్స్రోడ్డుపై ధర్నా చేశారు.
ప్రభుత్వంలో ఉన్న.. నా గతే ఇట్లున్నది
నాకు సొంత భూమి ఏడెకరాలు ఉంది. పదెకరాలు కౌలుకు తీసుకుని వరి వేసిన. దాదాపు 500 క్వింటాళ్ల వరకు పండించిన. పోయిన నెల 15వ తారీఖున వరి కోసిన. కల్లాల్లో వడ్లు పోసుకుని ఎదురుచూస్తున్న. నా లైన్ రాలేదని అంటున్నరు. వడ్లు మొత్తం ఇక్కడే ఉన్నయ్. 15 క్వింటాళ్ల వరకు తడిసి మొలకొచ్చినయ్. సగం జోకిన సంచులున్నయ్. మూడు జాగల్ల పెట్టిండ్రు. ఏమైనా అంటే లైన్ అంటున్నరు. వర్షం పడితే దిగవడుతదని అధికారులకు చెప్పినం. ఎవరూ పట్టించుకుంటలేరు. జోకుడు ముందుకు సాగుతలేదు. ఇప్పటివరకు అనంతపల్లి గ్రామంల దాదాపు 25 లారీల వడ్లు ఉన్నయి. ఎవరిని అడిగినా రేపూమాపు అంటున్నరు. లేబర్ లేరని, హమాలీలు లేరని, లారీలు వస్తలేవని చెప్తున్నరు. అధికారులు వచ్చి చూసింది లేదు. మాది ఐకేపీ గ్రూపోళ్లకు ఇచ్చిండ్రు. గ్రూపుసభ్యులు ఉండరు. ప్రభుత్వంల సింగిల్ విండో డైరెక్టర్గా ఉన్న నా పరిస్థితే ఇట్లున్నది. మిగతా రైతులు ఎంత గోసవడుతున్నరో అర్థం చేసుకోవచ్చు.
-అనపట్ల తిరుపతిరెడ్డి, అనంతపల్లి, కాంగ్రెస్ నాయకుడు, సింగిల్విండో డైరెక్టర్