హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): జీవో 7ను రద్దు చేసి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సోమవారం సెక్రటేరియట్ను ముట్టడించారు. పెద్ద సంఖ్యలో విద్యా ర్థి నేతలు సచివాలయం గేట్ వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నేతలను అదుపులోకి తీసుకున్నారు. వారిని గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
విద్యార్థుల భవిష్యత్తో చెలగాటం:తుంగ బాలు
ఫీజు రీయింబర్స్మెంట్ రద్దుకు కుట్రలు చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తో రాష్ట్ర సర్కార్ చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరసన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.రెండున్నరేండ్ల పాలనలో రూ. 10 వేల కోట్లు బకాయి పెట్టి 14 లక్షల మంది విద్యార్థులను అంధకారంలోకి నెట్టిందని ధ్వజమెత్తారు. జీవో 7తో కాలేజీలు మూతపడి పేద విద్యార్థులు ఉన్నతవిద్యకు దూరమయ్యే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి నేతలపై ప్రభుత్వం దౌర్జన్యానికి దిగడం దుర్మార్గమని ఖండించారు. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలతో విద్యారంగం అస్తవ్యస్తమయ్యే పరిస్థితి నెలకొన్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర నేత పడాల సతీశ్ మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నిరుపేద పిల్లల కోసం ఏర్పాటు చేసిన గురుకులాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కత్తిగట్టిందని ఆరోపించారు.
‘గెల్లు’ ముందస్తు అరెస్ట్..
బీఆర్ఎస్వీ నిరసన నేపథ్యంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ను సోమవారం మధ్యాహ్నం ఆయన నివాసం వద్ద పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి, పోలీస్స్టేషన్కు తరలించారు. అంతకుముందు గెల్లు మీడియాతో మాట్లాడుతూ డీబీటీ పద్ధతిలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ప్రభుత్వం విద్యార్థులను మభ్యపెడుతున్నదని ఆరోపించారు. రెండున్నరేండ్లుగా నయాపైసా విడుదల చేయని రేవంత్ సర్కార్ నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమచేస్తామంటే నమ్మేవారు లేరని స్పష్టంచేశారు. వెంటనే చీకటి జీవో7ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు.