హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): పదో తరగతితోపాటు టీఎస్పీఎస్సీ పరీక్షపత్రాల లీకేజీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం ఉన్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ పోలీసులకు తన సెల్ఫోన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్లో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, ఆరెస్సెస్ ఉపాధ్యాయ సంఘాలతో కుమ్మైక్కె తాండూరులో తెలుగు పేపర్ను లీక్ చేశారని, ఆ తరువాత హిందీ పేపర్ లీక్ చేశారని విమర్శించారు. పేపర్ లీకేజీకి పాల్పడ్డ బూరం ప్రశాంత్ గతంలో ఏబీవీపీలో పనిచేయగా, మహేశ్ గతంలో ఈటల రాజేందర్కు ఎన్నికల ఏజెంట్గా పనిచేశారని వివరించారు. లీకేజీకి పాల్పడినవారందరికీ బీజేపీతో సంబంధం ఉన్నదని స్పష్టం చేశారు.
బండి బెదిరింపులు
తనను పోలీసులు కొట్టారంటూ బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ సీపీలను, డీసీపీలను, పోలీసు వ్యవస్థను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రఘనందన్రావు ఆల్ ఇండియా సర్వీసు అధికారులను ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని, బీజేపీ లీగల్ టీమ్ బండి బెయిల్ కోసం బెదిరించే ప్రయత్నం చేశారని విమర్శించారు. వరంగల్ కోర్టులో బండి బెయిల్ సందర్భంగా జరిగిన పరిణామాలపై న్యాయ వ్యవస్థ, మీడియా దృష్టి పెట్టాలని కోరారు.
కేసీఆర్ను ఎదుర్కోలేకే లీకేజీలు: జీవన్రెడ్డి
బండి సంజయ్ ప్రశ్నపత్రాల లీకర్గా, బొంకుడు మాటల బ్రోకర్గా మారారని పీయూసీ చైర్మన్ ఏ జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు. పేపర్ లీకేజీలో ప్రశాంత్కు గుడ్ జాబ్ అం టూ బండి సంజయ్ ఎందుకు మేసేజ్ చేశారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ను నేరుగా ఎదుర్కోలేక ప్రశ్నపత్రాల లీకేజీ ద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లిదండ్రులు బండి సంజయ్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మైలేజీ కోసం ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన ఏకైక పార్టీ బీజేపీ అని ఎద్దేవా చేశారు.