గజ్వేల్, నవంబర్ 30: వైఎస్ఆర్టీపీ నాయకురాలు షర్మిల బీజేపీ వదిలిన బాణమని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. షర్మిలది ఏ రాష్ట్రమని, తెలంగాణకు ఆమె ఎందుకొచ్చారని ప్రశ్నించారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణ ప్రజలను అయోమయానికి గురిచేసేందుకు బీజేపీయే షర్మిలను ఉసిగొల్పిందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం గురించి, సీఎం కేసీఆర్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సంక్షేమ పాలనను కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని దించాలన్న కుట్రతో బీజేపీ, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా దిక్కుమాలిన ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సంక్షేమ పాలన చేతగాని మోదీ, షా.. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొని, ప్రజా ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నారని వంటేరు నిప్పులు చెరిగారు.
అభివృద్ధిని ఓర్వలేక..: వాసుదేవరెడ్డి
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని బీజేపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని వాసుదేవరెడ్డి విమర్శించారు. బండి సంజయ్, షర్మిల, రేవంత్రెడ్డి దిక్కుమాలిన పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణలో తిరిగే హక్కు షర్మిలకు లేదనిన్నారు. తెలంగాణలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు దమ్ముంటే విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ‘దేశ అభివృద్ధి పేరిట వంద లక్షల కోట్లు అప్పు చేసిన మోదీ.. అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు ఆ సొమ్ము నుంచి రూ.3 లక్షల కోట్లు ఇవ్వలేరా?’ అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాస్వామ్యబద్ధ్దంగా మాట్లాడాల్సిన విపక్షాల నాయకులు పిచ్చికుక్కల్లా మొరిగి గౌరవాన్ని కోల్పోవద్దని హితవు పలికారు.