పట్టించుకోవడం లేదంటూ ప్లకార్డులతో నిరసన
కృష్ణకాలనీ, జూన్ 10 : కొడుకులు పట్టించుకోవడం లేదంటూ ఓ తండ్రి రోడ్డెక్కాడు. బాధితుడి కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లికి చెందిన కట్ల బుచ్చయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రవీందర్ కరీంనగర్ జిల్లాలో సీఐగా, చిన్న కొడుకు మహేందర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. ఇద్దరు కొడుకులు ఉన్నా తిండి పెట్టడం లేదంటూ బుచ్చయ్య శుక్రవారం భూపాలపల్లిలోని జయశంకర్ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసనకు దిగాడు. ఈ సందర్భంగా బుచ్చయ్య తనగోడును వెల్లబోసుకొన్నాడు. ఎంతో కష్టపడి ఇద్దరు కొడుకులను ప్రయోజకులను చేశానని, ఒక్కొక్కరికి 60 గుంటల భూమి ఇచ్చానని తెలిపాడు.
తానూ 30 గుంటలు ఉంచుకొంటే పెద్ద కొడుకు రవీందర్ ఆ 30 గుంటల భూమిని రూ.16 లక్షలకు విక్రయించి రూ.12 లక్షలే వచ్చాయంటూ ఆ మొత్తాన్ని జాయింట్ అకౌంట్లో వేశాడన్నారు. ఇందుకు సంబంధించి వడ్డీ రూ.4 వేలు వస్తున్నా, బతకడానికి సరిపోవడం లేదన్నాడు. ఇదే విషయాన్ని రవీందర్ను అడిగితే పెట్రోల్ పోసి తగులబెట్టి చంపుతానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్యకు తిండి పెట్టకుండా పెద్దకొడుకు, కోడలు కొట్టడం వల్ల అవమానభారంతో రెండేండ్ల క్రితం ఆత్మహత్య చేసుకొన్నదని కన్నీటిపర్యంతమయ్యాడు. ఇప్పుడు తాను వెళ్లి అడిగితే చెప్పుతో కొట్టాడని, పెద్ద కొడుకుతో తనకు ప్రాణభయం ఉన్నదని, అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకొన్నాడు.