కామారెడ్డి, మార్చి 8 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో అదృశ్యమైన ముగ్గురు పిల్లల మృతదేహాలు చెరువులో లభ్యం కాగా.. వారిని హత్యచేసింది కన్నతండ్రేనని పోలీసులు తెలిపారు. ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆదివారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్బీనగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సీపాత్ (8), అయాత్ (7), మరియం (5) శనివారం ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లి, తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఎస్పీ రాజేశ్చంద్ర ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టిన పోలీసులు ..పిల్లలను ఎక్కడికి తీసుకెళ్లారో సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. పరారీలో ఉన్న తండ్రి ఇస్మాయిల్ను ఆదివారం అదుపులోకి తీసుకొని విచారించగా.. అప్పులు, ఆర్థిక భారంతో తానే ముగ్గురు పిల్లలను కామారెడ్డి పెద్ద చెరువులో తోసేసినట్టు ఒప్పుకున్నాడు.
గజఈతగాళ్ల సాయంతో అయాత్, మరియం, సీపాత్ మృతదేహాలను వెలికితీసి, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్ పంపినట్టు ఎస్పీ తెలిపారు. అలాగే ఈ నెల 6న అదృశ్యమైన గోసంగి కాలనీకి చెందిన ఇద్దరు పిల్లల జాడను త్వరలోనే గుర్తిస్తామని చెప్పారు. సమావేశంలో పట్టణ, రూరల్ సీఐలు నరహరి, రామన్ పాల్గొన్నారు.