హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ శుక్రవారం మరో ఇద్దరిని అరెస్టు చేసింది. ఈ కేసులో నిందితుల సంఖ్య 20కి, అరెస్టయినవారి సంఖ్య 19కి చేరింది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన సిట్.. ఏఈ, గ్రూప్-1, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్(డీఏవో) పేపర్ను కొనుగోలు చేసి పరీక్షలు రాసిన వారిని ఒక్కొక్కరిని అరెస్టు చేసి, కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని లోతైన దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన నిందితులు ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి ప్రశ్నపత్రాలను అపహరించి, రేణుక, ఆమె భర్త ఢాక్యానాయక్కు విక్రయించగా, ఈ దంపతులు మరికొందరికి అమ్మారు. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లాలోని ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న గండీడ్ మండలానికి చెందిన మైబయ్యను ఢాక్యానాయక్ సంప్రదించాడు.
ఏఈ పరీక్షకు సిద్ధమవుతున్న తన కొడుకు జనార్దన్ కోసం మైబయ్య రూ.2 లక్షలు ఢాక్యానాయక్కు అందించాడు. జనార్దన్కు పరీక్షకు ఒక రోజు ముందు అంటే మార్చి 4న పరీక్ష పత్రం ఇచ్చి న ఢాక్యా.. తన ఇంట్లోనే మధ్యాహ్నం వరకు సిద్ధం కావాలని సూచించాడు. రూ.2 లక్షలే ఇచ్చావు కాబట్టి పరీక్ష పత్రాన్ని చూసుకోవడానికి అవకాశం ఇస్తున్నా, అదే మొత్తం రూ.6 లక్షలు ఇస్తే జిరాక్స్ తీసి ఇచ్చేవాడినంటూ ఢాక్యా వారితో చెప్పాడు. ఒక రోజు ముందు జనార్దన్కు పరీక్ష పత్రం చూపించి, అతడిని పరీక్షకు సిద్ధంచేసినట్టు విచారణలో వెల్లడైంది. శుక్రవారం మైబయ్య, అతని కొడుకు జనార్దన్ను అరెస్టు చేసిన సిట్ అధికారులు.. వీరితో ఇంకెవరికైనా లింకులున్నాయా? అనే విషయంపై ఆరా తీయనున్నారు.