హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ)/తిప్పర్తి /గిర్మాజీపేట : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు రాష్ర్టాలకు చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. భారత కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ దుర్ఘటన చోటుచేసుకొన్నది. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం గోదావరిగూడెంకు చెందిన గోదా ప్రేమ్కుమార్రెడ్డి (26), వరంగల్ ఎల్లమ్మబజార్కు చెందిన గుల్లపెల్లి పావని(22), ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియపులంకకు చెందిన సాయి నరసింహ(23) ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లారు. వీరంతా వేర్వేరు రాష్ర్టాల్లో ఉంటూ మరో ఐదుగురు మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. తిరిగి వస్తుండగా కనెక్టికట్ రాష్ట్రంలో పొగమంచు కారణంగా వీరి వ్యాన్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రేమ్ కుమార్రెడ్డి, పావని, సాయినరసింహ అక్కడికక్కడే మృతిచెందగా, మిగిలిన ఐదుగురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరంతా రెండునెలల క్రితమే ఆమెరికా వెళ్లినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.