కేసీఆర్ పాలనలో ఏనాడూ విత్తనాలు, ఎరువుల కోసం రోడ్డెక్కని రైతులకు మళ్లీ ఇప్పుడు సమైక్యరాష్ట్రంలోని రోజులు గుర్తొస్తున్నాయి. దశాబ్దం తర్వాత సంగారెడ్డి జిల్లా జోగిపేటలో విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. సీడ్స్ కొరత కారణంగా మంగళవారం ఇలా లైన్కట్టారు.
Telangana | అందోల్, మే 21: విత్తనాలు, ఎరువుల కోసం తెలంగాణలో పదేండ్లుగా కనిపించకుండా పోయినా దృశ్యాలు కాంగ్రెస్ సర్కార్ హయాంలో మళ్లీ దర్శనమిస్తున్నాయి. వానకాలం సీజన్ ప్రారంభంలోనే విత్తనాల కోసం లైన్లో నిలబడి రోడ్డెక్కే దుస్థితి నెలకొన్నది. మంగళవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటకు 138 క్వింటాళ్ల జీలుగ, 40 క్వింటాళ్ల జనుము విత్తనాలు వచ్చాయి. విత్తనాల కోసం వ్యవసాయ శాఖ కార్యాలయానికి టోకెన్ కోసం ఉదయమే వచ్చిన రైతులు క్యూలో నిలబడే ఓపిక లేక పట్టా పాసు పుస్తకాలు లైన్లో పెట్టి మధ్యాహ్నం వరకు అక్కడే కూర్చున్నారు. ఈ దృశ్యాల ఫొటోలు తీసిన రైతులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా వైరల్ కావడంతోపాటు ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.
సాయంత్రం స్థానిక రైతుసేవా కేంద్రంలో విత్తనాల బస్తాలు తీసుకునేందుకు వెళ్లగా అక్కడ సరిపడా బస్తాలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ జోగిపేట-సంగారెడ్డి ప్రధాన రహదారిపై వాహనాలు అడ్డంగా పెట్టి ధర్నా నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ జామైంది. అక్కడికి చేరుకున్న ఏడీఏ అరుణ, ఏవో విజయరత్న, ఎస్సై అరుణ్కుమార్గౌడ్ రైతులతో మాట్లాడి వారికి సర్దిచెప్పారు. ఏడీఏ అరుణ మాట్లాడుతూ జోగిపేట వ్యవసాయ శాఖకు 650 క్వింటాళ్ల జీలుగ, 80 క్వింటాళ్ల జనుము విత్తనాలను కేటాయించినట్టు తెలిపారు. విడతల వారీగా అందరికీ విత్తనాలు అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
పంట ఉత్పత్తులు కొనడం, విత్తనాల పం పిణీలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. డిమాండ్కు సరిప డా విత్తనాలను అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా, అందుకు అనుగుణంగా విత్తనాలను నిల్వ చేయకపోవడం దారుణమన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ రైతులు విత్తనాల కోసం పాస్పుస్తకాలు లైన్లో పెట్ట డం, రైతులు క్యూలో నిలబడటం వంటివి జరగలేదని తెలిపారు. రైతుల పక్షాన నిలబడేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. రైతు సంక్షేమానికి పాటుపడింది కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు.