Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలతో పంటలు నష్టపోయి, ధాన్యం నీళ్లపాలై పుట్టెడు దుఃఖంలో రైతులు కొట్టుమిట్టాడుతుంటే… సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. రైతులేమైతే మాకేంటి… ఎన్నికలే ముఖ్యం, రాజకీయాలే ప్రాధాన్యం అనేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఉన్న సమయం తమను పరామర్శించేందుకు లేదా ? అని బాధిత రైతులు మండిపడుతున్నారు. ఈ ప్రభుత్వానికి రైతుల కష్టాలు పట్టవా అంటూ ప్రశ్నిస్తున్నారు. రైతులకు భరోసా ఇచ్చే నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు.
పక్క రాష్ర్టాల్లో సీఎం ప్రచారం
రాష్ట్రంలో అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం రేవంత్రెడ్డి పక్క రాష్ర్టాల్లో ప్రచారానికి వెళ్లడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వడగండ్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కాంటాలలో జాప్యం చేయడం.. కొనుగోళ్లు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడంతో రైతులు ఎక్కువ నష్టపోయారు. ఇవేవీ పట్టని సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
రైతులను పరామర్శించి, ప్రభుత్వం నుంచి భరోసా కల్పిస్తే ఆయన ఏ రాష్ట్రంలో ప్రచారం చేసుకున్నా ఎవరూ ప్రశ్నించేవారు కాదు. ఈ నెల 17, 18న కేరళలో, 20న కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి.. మొన్న మెదక్లో, నిన్న భువనగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కనీసం అక్కడైనా అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించకుండా ప్రచారానికే ప్రాధాన్యం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి రైతులను పలకరించడం సంగతి దేవుడెరుగు… కనీస ప్రకటన కూడా కరువైంది. మూడు రోజులుగా వర్షం బీభత్సం సృష్టిస్తుంటే సీఎం రేవంత్రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం.
పత్తాలేని పౌరసరఫరాల శాఖ మంత్రి
రాళ్ల వానతో పంటలు దెబ్బతినగా, కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీళ్లపాలైంది. ధాన్యం విక్రయానికి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్న రైతుల కష్టాలు ఒకెత్తు అయితే.. రోజూ ఆరబోసి ఎండిన ధాన్యం అకాల వర్షానికి ఒక్కసారిగా కండ్లముందే కొట్టుకుపోతుంటే అన్నదాత బాధ వర్ణణాతీతం. ఇలాంటి పరిస్థితుల్లో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది.
తడిసిన ధాన్యాన్ని కొంటామని, కొనుగోళ్లు వేగవంతం చేస్తామని చెప్పాల్సిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పత్తా లేకుండా పోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజులుగా వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురవుతుంటే…సంబంధిత శాఖ మంత్రిగా ఉత్తమ్కుమార్రెడ్డి కనీసం స్పందించలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పంట పొలాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా ? ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖకు మంత్రి ఉన్నారా ? అని రైతులు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.